Showing posts with label రామాయణం. Show all posts
Showing posts with label రామాయణం. Show all posts

Thursday 27 July 2017

రావణ లంక దొరికింది..!


రామాయణం అనునది పుక్కిటి పురాణం కాదు ..నిజంగా జరిగినది అనే  సాక్షాలు ఇవిగో  .. ప్రతివొక్క హిందువుకు చేరేల షేర్ చెయ్యండి..
 సీతను దాచిపెట్టిన లంక దొరికింది. ఆంజనేయుడు సంజీవినీ పర్వతాన్ని తీసుకువచ్చి లక్ష్మణుణ్ణి కాపాడిన లంక దొరికింది.. రామ రావణ యుద్ధం భీకరంగా జరిగిన లంక దొరికింది. ఇవి ఒట్టి మాటలు కావు.. పుక్కిటి పురాణం అంతకంటే కాదు.. లక్షల సంవత్సరాల నాటి యథార్థ గాథ.. ఒక మహా అసురుని ఉనికిని ఇవాళ్టికీ చాటి చెప్తున్న కథ.. ఇంతకాలం మిథ్యగా భావిస్తున్న చరిత్ర. రావణ రహస్య మిది..
ఇదేదో సోది రామాయణ కథ కాదు.. రావణ లంక.. ఇది ఒక నిజం.. నిప్పులాంటి నిజం... వైజ్ఞానికులకు కొత్త సవాలును విసురుతున్న నిజం.. భారత దేశ చరిత్రను గొప్ప మలుపును తిప్పనున్న నిజం... ఒక నాడు రావణుని రాజరికం అప్రతిహతంగా సాగిన రాజ్యం... సాక్ష్యాలతో సహా లభించింది. రామ రావణ యుద్ధంలో ఆనాడు రావణుడు చనిపోయి ఉండవచ్చు. కానీ, శ్రీలంకలో కనిపిస్తున్న సాక్ష్యాలలో రావణుడు ఇంకా జీవించే ఉన్నాడు.. ఇది నిప్పులాంటి నిజం.
లంక మిథ్య కాదు.. లంకేశ్వరుడు రాజ్యమేలిన లంక.. ప్రపంచాన్నంతా జయించి తెచ్చిన బంగారంతో నిర్మించిన మహానగరం లంక.. సముద్రం మధ్యలో అందమైన దీవిలో, అపురూపంగా రావణుడు నిర్మించుకున్న నగరం లంక ఇదే..మీరు రాముణ్ణి నమ్మకపోవచ్చు.. రాముడు ఉన్నాడా.. లేడా అని హేతువాదులతో వాదాలకూ దిగవచ్చు. కానీ, రావణుడి ఉనికిని మాత్రం ఇవాళ ఎవరూ కాదనలేరు.. రావణుడు ఉన్నాడన్నది వాస్తవం. సాక్షాత్తూ శ్రీలంక సర్కారే రావణుడి ఆనవాళ్లను అధికారికంగా గుర్తించింది. రాజముద్ర వేసింది.
రావణుడి ఆనవాళ్ళు శ్రీలంకలో అడుగడుగునా కనిపిస్తున్నాయి. అశోకవనంతో ఈ గుర్తులు మొదలవుతాయి. అశోక వాటిక అని పిలిచే ఈ వనంలోనే సీతాదేవిని ఆనాడు రావణుడు బంధించి ఉంచాడు.. ఈ ప్రదేశంలో ఎవరు ప్రతిష్ఠించారో తెలియని వేల ఏళ్ల నాటి సీతారామచంద్రుల విగ్రహాలు మనకు కనిపిస్తాయి. ఈ ఆలయం పక్కనే సీతాజల పారుతుంది. సీతాదేవి కన్నీటితో ఏర్పడిన నీటి కుండమని ఇక్కడి ప్రజల విశ్వాసం..ఈ నీటి కుండాన్ని ఆనుకుని హనుమంతుని అడుగులూ మనకు కనిపిస్తాయి. అశోక వాటిక సమీపంలోమొక్కల్లో నల్లని మట్టి ఉంది.. ఇది మామూలు నల్లరేగడి మట్టో, లేక మరో రకమైన మట్టో కాదు.. బాగా కాలిపోయి ఉన్నట్లు కనిపించే మట్టి ఇది.. ఈ మట్టి ఇలా ఎందుకు ఉందో ఇప్పటి వరకు ఏ శాస్త్రవేత్తలకూ అంతుపట్టలేదు.. అశోక వాటిక చుట్టూ లెక్కలేనన్ని కోతులు ఎప్పుడూ తిరుగుతూ ఉంటాయి. ఈ ప్రదేశంలో ఇక్కడ మాత్రమే కోతులు కనిపిస్తాయి.
సీతా జలకు దగ్గరలోనే మరో చిన్న ఏరు పారుతుంటుంది.. అది నిత్యం రావణుడు స్నానం చేసే ఏరు.. ఇక్కడ స్నానం చేసి పరమేశ్వరుని అర్చించేవాడు రావణుడు.
ప్రతి చారిత్రక ప్రదేశాల్లో కొన్ని ప్రాంతాలను చూపించి స్థల పురాణాలు చెప్పటం సహజమే.. లంకలో కనిపిస్తున్న ఆనవాళ్ళు కూడా ఇలాంటివే అనుకుంటే పొరపాటే.. ఇవాళ్టి శ్రీలంకలో ఆనాటి తేజోమయ రావణ లంక స్మృతులు చాలా చాలా ఉన్నాయి.. త్రేతాయుగాన్ని మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి.
రావణ లంక సామాన్యమైంది కాదు.. రామాయణం ఉనికిని చాటిచెప్తున్న లంక.. రావణ స్నానం చేసే నది నుంచి దూరంగా చూస్తే ఓ పెద్ద పర్వతం కనిపిస్తుంది. ఆ పర్వతాన్ని జాగ్రత్తగా పరికిస్తే అతి పెద్ద హనుమాన్ ఆకృతి నిద్రిస్తున్నట్లుగా గోచరిస్తుంది.
ఈ పర్వతాన్ని రాము సోలా అని ఇక్కడి ప్రజలు పిలుస్తారు.. ఈ పర్వతం ఒక విచిత్రమైన పర్వతం.. రామ రావణ యుద్ధం జరుగుతున్న సమయంలో లక్ష్మణుడు మూర్ఛ పోయినప్పుడు హనుమంతుడు హిమాలయాల నుంచి సంజీవని మొక్కను తీసుకువచ్చిన పర్వతం ముక్క ఇది.
ఇది సంజీవని తీసుకువచ్చిన పర్వతమేననటానికి రుజువేమిటి? ఏదో టూరిజం డెవలప్ చేసుకోవటానికి లంక సర్కారు ఏదో ఒక కొండను చూపించి ఇదే సంజీవని అంటే నమ్మేదెలా?
శ్రీలంక సర్కారు ఏమైనా చెప్పవచ్చు. కానీ, ఇది ఆంజనేయుడు సంజీవని తీసుకువచ్చిన సుమేరు పర్వతమనటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇలాంటి పర్వత భాగం శ్రీలంకలో మరెక్కడా కనిపించదు.. మనకు ఇది మామూలు కొండ.. కానీ, శ్రీలంక ప్రజలకు ఇది హాస్పిటల్... ఈ పర్వతంలో దొరికే మొక్కలన్నీ ఔషధ మొక్కలే కావటం ఇది సుమేరువే అనటానికి బలమైన సాక్ష్యం.
దీనికి దగ్గరలో ఉన్న ప్రజలు ఏ జబ్బు వచ్చినా డాక్టర్ల దగ్గరకు వెళ్లరు.. ఈ పర్వతం దగ్గరకు వచ్చి ఇక్కడి మొక్కలతోనే వైద్యం చేయించుకుంటారు..నికోల్ పారమల్ ఫార్మాస్యూటికల్స.. ఇతర దేశీయ, అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఈ ప్రాంతానికి వచ్చి ఔషధ మొక్కలను పరిశోధించాయి.
విచిత్రమేమంటే ఈ ఔషధ మొక్కలు పెరగాలంటే ప్రత్యేకమైన మట్టి కావలసి ఉంటుంది.. ఈ కొండపై మనకు కనిపించే మట్టి హిమాలయాల్లో మాత్రమే కామన్గా కనిపిస్తుంది...
రావణుడు దశకంఠుడు.. అంటే పది తలలు ఉన్నవాడు.. అంటే శారీరకంగా కాదు.. అతనిలో పది రకాల వ్యక్తిత్వాలు ఉన్నాయని అర్థం. అతని మేధస్సు పది రకాలుగా, అనేక రంగాల్లో విస్తరించిందని అర్థం. ఇందుకు సాక్ష్యం మనకు లంకలో స్పష్టంగా కనిపిస్తుంది. అతను పండితుడో, సీతను అపహరించుకు వచ్చిన రాక్షసుడు మాత్రమే కాదు.. రావణుడు గొప్ప శాస్త్రవేత్త కూడా.
మీకు పుష్పక విమానం గుర్తుందా? అందులోనే సీతాదేవిని రావణుడు అపహరించుకు వెళ్లాడు... రావణ సంహారం తరువాత రాముడు అందులోనే అయోధ్యకు తిరిగి వచ్చాడు. ఆ కాలంలో విమానాలు ఉన్నాయా? అంటే ఉన్నాయని లంక చెప్తోంది.. చూపిస్తోంది.. రావణుడు తన లంకాపట్టణంలో నిర్మించిన అయిదు విమానాశ్రయాలను శ్రీలంక సర్కారు గుర్తించింది.. అంతే కాదు.. ఒక విమానాల మరమ్మతు కేంద్రాన్ని కూడా గుర్తించింది.. వీటన్నింటినీ హనుమంతుడు లంకాదహన సమయంలో కాల్చివేశాడు..
శ్రీలంక పరిశోధనల్లో గరుడ పక్షి ఆకారంలోని ఓ బొమ్మ దొరకింది. ఈ ఆకారాన్ని జాగ్రత్తగా పరిశోధించారు... గరుడపక్షి ఆకృతిలో ఉన్న ఈ బొమ్మ మామూలు విగ్రహం కాదు.. దీనికి ఉన్న రెక్కలు సాధారణ గరుడ పక్షికి ఉండే స్థాయి కంటే కొద్దిగా ఎత్తులో ఉన్నాయి. దీనిపై ముగ్గురు వ్యక్తులు కూర్చుని ఉన్నారు.. వాస్తవానికి ఇది ఓ లోహ యంత్రం. వేల ఏళ్ల నాటిది.. ఆనాడు ఇది ఎలా ఎగిరిందీ అన్నదానిపై లంక ప్రభుత్వం ఇంకా పరిశోధిస్తూనే ఉంది.
ఇక విమానాశ్రయం దగ్గరకు వస్తే.. శ్రీలంక రాజధాని కొలంబో నుంచి దాదాపు తొమ్మిది గంటల పాటు ప్రయాణం చేస్తే ఓ పెద్ద పర్వత ప్రాంతం వస్తుంది. ఇక్కడ దాదాపు ఎనిమిది వేల అడుగుల ఎత్తున సుమారు ఎనిమిది కిలోమీటర్ల విస్తీర్ణంలో మైదాన ప్రాంతం ఉంది.. అంత ఎత్తున ఇంత విస్తీర్ణంలో మైదానం ఉండటం, ఈ మైదానానికి నాలుగు వైపులా కొండలు ఉండటం విశేషం. ఈ మైదానం మానవ నిర్మితమైనదేనని స్పష్టంగా కనిపిస్తోంది. దీన్నే రావణుడు తన విమానాశ్రయంగా వినియోగించాడని శ్రీలంక పరిశోధన బృందం నిర్ధారించింది.
మరో విశేషమేమంటే ఈ మైదానం అంతటా కాలిపోయిన గుర్తులు ఉన్నాయి. ఇక్కడి మట్టి కాలి నల్లగా మాడిపోయింది.. ఇక్కడి రాళు్ల కాలి కనిపిస్తున్నాయి. ఎనిమిది వేల అడుగుల ఎత్తులో తక్కువ వాతావరణం ఉన్న ఈ ప్రాంతంలో ఇంకా వేడి వాతావరణం ఉండటం విశేషం.. లంకాదహనం చేసినప్పుడు హనుమంతుడు ముందుగా రావణుడి రవాణా వ్యవస్థను, సాంకేతిక వ్యవస్థలనే దహనం చేశాడు.. అందుకు సాక్ష్యం ఈ విమానాశ్రయం.
రావణుడికి సంబంధించిన వివరాలు ముఖ్యంగా వాల్మీకి రామాయణంలో, ఆ తరువాత తులసీదాస్ రామచరిత మానస్లో మనకు ముఖ్యంగా కనిపిస్తాయి.. లంకలో అడుగడుగునా రామాయణ కాలం నాటి గుర్తులు లభిస్తున్నాయి..
తులసీదాస్ రాసిన రామచరితమానస్ ఒరిజినల్ ప్రతి ఒకటి చిత్రకూటంలో భద్రంగా ఉంది. అయితే ఆయన స్వయంగా రాసిన వాటిలో ఒకే ఒక అధ్యాయం ప్రపంచానికి మిగిలి ఉంది. చేత్తో తయారు చేసిన కాగితంపై రాసిన ఈ రామాయణంలో మిగిలి ఉన్న అధ్యాయం 117 పేజీల్లో ఉంది. ఒక్కో పేజీకి 7లైన్లు రాసి ఉంది.
కెలీనియా.. రావణుడి తమ్ముడు విభీషణుడి రాజభవనం ఉన్న ప్రాంతం.. ప్రస్తుతం బౌద్ధ ధర్మాన్ని పాటిస్తున్న శ్రీలంకలో కెలీనియా చాలా ముఖ్యమైన ప్రదేశం. బుద్ధ భగవానుడు ఈ ప్రాంతానికి వచ్చినట్లు చరిత్ర చెప్తోంది. ప్రపంచంలోని బౌద్ధులు శ్రీలంకకు వస్తే కెలీనియా చూడకుండా వెళ్లరు.. ఆ పక్కనే విభీషణుడి భవనాన్నీ సందర్శిస్తారు.. ఇంతెందుకు లంక సార్లమెంటులో విభీషణుడి ఫోటో కనిపిస్తుంది...
ఆ తరువాత నరోలియా.. ఇక్కడే అశోక్ వాటిక ఉంది. దీనికి సమీపంలోనే సీతాదేవి అగ్ని ప్రవేశం చేసింది. అయితే ఇక్కడ విచిత్రం ఉంది. ఇక్కడ అటవీ ప్రాంతంలో కొన్ని చిత్రమైన గోళీలు దొరుకుతాయి. ఈ గోళీలను సీతా గోళీలంటారు.. ఇవి అలోపతి మాత్రల్లాంటివి.. ఈ గోళీలను దొరకడమే భాగ్యంగా ప్రజలు భావిస్తారు. వీటిని తలకు రాసుకోవటం, కడుపుకు రాసుకోవటం, వాటిని పొడిని చేసి కొద్దిగా తీసుకోవటం వంటివి చేస్తారు.. ఈ గోళీలను శ్రీలంక ప్రభుత్వం జపాన్కు పంపించి పరీక్ష చేయించింది. ఇందులో వైద్య లక్షణాలు ఉన్నట్లు దాదాపు పదివేల సంవత్సరాలకు పూర్వ కాలం నాటివేనని నిర్ధారణ అయింది. రావణుడికి సంబంధించి ఇప్పటి వరకు లభించిన ఆధారాలన్నీ ఒక ఎత్తైతే , అసుర రాజు అస్తిత్వానికి సంబంధించిన అత్యంత కీలక సాక్ష్యం మరొకటి ఉంది. అది రావణ గుహ. లంకలో రామరావణ యుద్ధం భీకరంగా జరిగింది. రామబాణంతో రావణుడిని శ్రీరామ చంద్రుడు హతమార్చాడు.. రావణుడు మరణించిన తరువాత ఏం జరిగింది? వాల్మీకి రామాయణంలో కానీ, రామ చరితమానస్లో కానీ, రావణుడు చనిపోయిన తరువాత ఏం జరిగిందో ప్రస్తావన లేదు.. రావణుడి అంత్యక్రియలు జరిగాయో లేదో తెలియదు.. కానీ, ఇప్పుడు రావణుడికి సంబంధించిన అత్యంత గొప్ప రహస్యం వెలుగులోకి వచ్చింది. అదే రావణ గుహ.
శ్రీలంకలోని కెలీనియాకు కొద్ది దూరంలోఎత్తైన ప్రదేశంలో ఒక పెద్ద గుహ ఉంది.. ఈ గుహలోకి ప్రవేశించటం చాలా కష్టమైన పని.. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం పశువులు కాసుకునే ఒక కాపరి ఈ గుహలోకి అనుకోకుండా వెళ్లాడు.. ఈ గుహలో ఒక పెద్ద శవపేటిక ఉంది.. ఈ పేటికలో ఒక శవం ఉందని, దాన్ని చూడగానే భయంతో వెనక్కి వచ్చేసినట్లు అతను చెప్పాడు.. అది రావణుడి భౌతిక శరీరమని చెప్తున్నారు.. ఈ శవపేటిక దాదాపు పదిహేడు అడుగుల పొడవు, నాలుగు అడుగుల వెడల్పుతో ఉంది. ఈ శవపేటిక చుట్టూ రకరకాల రసాయన లేపనాలు రాసి ఉన్నాయి.
రావణుడు చనిపోయిన తరువాత ఆయన భౌతిక దేహాన్ని నాగజాతి ప్రజలు తీసుకెళ్లి ఈ శవపేటికలో భద్రపరిచారట. శ్రీలంక ప్రభుత్వం ఒక ప్రత్యేక బృందాన్ని పంపించి ఈ శవపేటికను తెరిచేందుకు పలుమార్లు ప్రయత్నించింది. ప్రయత్నించిన ప్రతిసారీ ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది. ఒకసారి చిరుతపులులు, మరోసారి పెద్ద పాములు అడ్డం వచ్చాయి. హెలికాప్టర్లో వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు సరిగ్గా గుహ దగ్గరకు వచ్చేసరికి వాతావరణం హఠాత్తుగా మారిపోయి తప్పనిసరిగా వెనక్కి మళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ గుహలో అతని అనుచరులు కాపలా ఉన్నారని, లక్ష్మణుడి మాదిరిగా సంజీవని తో తమ రాజు పునర్జీవుతుడవుతాడని నమ్ముతున్నారు .. రావణుడి ఉనికికి సంబంధించిన చాలా ముఖ్యమైన సాక్ష్యం ఇది. ఈ పేటిక రహస్యాన్ని ఛేదించగలిగితే చరిత్రలో అనేక కొత్త కోణాలు వెలికి వస్తాయి. చూద్దాం ఏం జరుగుతుందో. కాలమే సమాధానం.
రావణుడు.. రామాయణం... భారతీయ సంస్కృతి, నాగరికతలతో గాఢంగా పెనవేసుకుని పోయిన అంశాలు.. శ్రీలంకలో రావణుడి ఆనవాళ్లు అనేకం మనకు కనిపిస్తాయి. అడుగడుగునా కనిపించే అక్కడి నిర్మాణాలు, కట్టడాల శిథిలాల్లో ఏడువేల సంవత్సరాల క్రితమే అత్యంత వైభవంగా భారత ఉపఖండంలో విలసిల్లిన నాగరికత స్పష్టంగా కనిపిస్తుంది.. అంతే కాదు.. రామాయణం గురించి మనకు అందుబాటుకు ఇంతకాలం రాని అనేక అంశాలు మనకు లంకలో కొత్తగా కనిపిస్తాయి.లంకలో రావణ రహస్యం గురించి మరి కొన్ని అంశాలను మనం తెలుసుకుందాం.
మనలో ప్రత్యేకించి ఈ తరంలో వాల్మీకి స్వయంగా రాసిన అసలైన రామాయణాన్ని చదివిన వాళ్లు వేళ్లపైన లెక్కించదగిన వాళ్లే ఉంటారు.. ఈ తరానికి తెలిసిందల్లా, ఎక్కువగా సినిమాల్లో చూసిన రామాయణ కథే...ఈ దేశంలో ఎన్ని రామాయణాలు వెలుగులోకి వచ్చాయో చెప్పలేం.. వాల్మీకి రాసింది ఒక రామాయణం.. వేర్వేరు భాషల్లో వేర్వేరు సమయాల్లో వచ్చిన రామాయణాల్లో కొత్త కొత్త ఉపకథలు పుట్టుకొచ్చాయి.. ఇప్పుడు లంకలో మనకు చూపిస్తున్న ఆనవాళ్లలో మరో సరికొత్త రామాయణం ఆవిష్కారం అవుతోంది.
రావణుడు సీతాదేవిని పంచవటి నుంచి అపహరించుకుని వెళ్లి ఎక్కడ దాచాడు? అని అడిగితే టక్కున వచ్చే జవాబు అశోక వనం.. కానీ లంక అదే శ్రీలంకలో సీన్ వేరేలా ఉంది.. సీతాదేవిని పరిస్థితులను బట్టి, ముందు జాగ్రత్త చర్యగా వేర్వేరు ప్రదేశాలకు రావణుడు తరలించాడట..పంచవటిలో, పర్ణశాలలో ఉన్న సీతాదేవిని తన పుష్పకంలో లంకకు తీసుకువచ్చిన రావణుడు వెరగన్ తోటలోని తన ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాడు.. పక్కనే ఉన్న తన భార్య మండోదరి దేవి భవనానికి సీతమ్మను తీసుకువెళ్లాడు.
లంకాపురంలో అతిగొప్ప ప్యాలెస్ మండోదరికి ఉండేదిట..చుట్టూ జలపాతాలు.. పూల తోటలు. అక్కడ సీత ఉన్నది కొన్ని రోజులే. ఆ తరువాత అశోకవాటికకు తరలించాడు.. మండోదరి భవనానికి చాలా దూరంలో అశోక వాటిక ఉంది. అక్కడికి విమానంలోనే సీతను రావణుడు తీసుకువెళ్లాడు.. ఆకాశమార్గంలో లంకానగర సౌందర్యాన్ని అద్భుతంగా ఏరియల్ వ్యూ ద్వారా సీతాదేవికి వర్ణిస్తూ చూపించాడట రావణుడు.
అశోక వాటికకు సమీపంలోనే సీతా పకన్ అనే చిన్న ప్రాంతం ఉంది.. చుట్టూ కమ్ముకుని ఉన్న దట్టమైన అడవి.. నిటారుగా నిలుచుని వున్న వృక్షాల మధ్య ౨౦౦ గజాల మేరకు ఉన్న చిన్న స్థలం.. అంత అడవిలో ఇక్కడ చిన్న మొక్క కూడా మొలవదు.. గతంలో ఇక్కడ నీళ్లు ఉండేవట.. సీతాదేవి లంకనుంచి అయోధ్యకు వెళ్లిన తరువాత ఇది పూర్తిగా డ్రె అయిపోయింది.. అప్పటి నుంచి ఇలాగే ఉంది.
ఇస్త్రిపుర . అంటే ఏరియా ఆఫ్ వుమెన్ అని అర్థం. హనుమంతుడు లంకకు వచ్చి చేయాల్సిన బీభత్సం అంతా చేసేశాక, ముందు జాగ్రత్త చర్యగా రావణుడు సీతాదేవిని అశోకవాటిక నుంచి ఇస్త్రిపురకు తరలించాడట. ఇక్కడి నుంచి కూడా రావణ గోడా అనే ప్రాంతానికి సీతను షిప్ట్ చేసినట్లు చెప్తారు.. అది ఇస్త్రిపురకు మరోవైపున ఉంది...
ఈ ప్రాంతాన్ని దిశృంపోలా అంటారు ఇప్పుడు ఇక్కడ బుద్ధుడి ఆలయం ఉంది.. దీంతో పాటే అతి ముఖ్యమైన ప్రాంతం ఇది.. రావణ సంహారం తరువాత సీతాదేవి అగ్ని ప్రవేశం చేసిన ప్రదేశం ఇదే... ఇక్కడ బౌద్ధ మతాచార్యులు ఓ స్తూపాన్ని కూడా నిర్మించారు..
లంకలో సీతాదేవికి సంబంధించిన చాలా ఆనవాళ్లను మనం చూడవచ్చు. అదే సమయంలో రామాయణంలో రావణుడి సంబంధించినంత వరకు మిగతా కేరెక్టర్లు కొన్ని ఉన్నాయి..వాళ్లకు సంబంధించిన స్మృతులు కూడా ఇప్పటికీ మనకు లంకలో కనిపిస్తాయి...
లంకలోని కెలీనియాలో రావణ సోదరుడు విభీషణుడికి పట్టాభిషేకం జరిగినట్లు గతంలోనే చెప్పుకున్నాం...ఇక్కడ విభీషణుడికి ఓ ఆలయం కూడా ఉంది.. లంక పార్లమెంటులో కూడా విభీషణుడి చిత్రపటం మనకు కనిపిస్తుంది..అంతే తప్ప అంత గొప్ప నాగరికతను ప్రపంచానికి అందించిన రావణుడికి మాత్రం ఎక్కడా ఆలయం లేదు..
రావణుడి కొడుకు ఇంద్రజిత్.. ఇతను కూడా శివుడికి మహా భక్తుడు.. ఈతడు శివుని పూజించిన ఆలయం, అందులో శివలింగం ఇవాళ్టికీ పూజలందుకుంటున్నాయి.
రావణుడి తల్లి కేకసి.. ఈమె భవనం సముద్రానికి సమీపంలో ఉండేది.. ఆమె నిత్యం ఉదయం ఇసుకతో శివలింగాన్ని తయారుచేసి దానికి పూజ చేసి వచ్చేది.. శ్రీలంకలోని తిరుక్కోవిల్లో ఆమె తల్లి భవంతి ఉండేది.. ఇప్పుడా ప్రాంతంలో దేవాలయం ఉంది..ఇక్కడో విచిత్రం ఉంది.. తన తల్లి మరణించిన తరువాత ఆమె అంత్యక్రియలు జరిపిన తరువాత స్నానాదులకు మంచినీరు కరవైందట.. అప్పుడు రావణుడు తన త్రిశూలంతో ఏడుసార్లు నేలను గట్టిగా కొట్టాడట.. దీంతో ఏడు ప్రాంతాలలోని నీటిధార ఉబికి వచ్చింది. సముద్రానికి దగ్గరలో మంచినీటి బావులు ఇవి. ఈ ఏడింటిలో నీటి ఉష్ణోగ్రతలు ఏడు రకాలుగా ఉండటం ఇక్కడి విచిత్రం.
తోటపాలకొండలో రావణుడి అతి పెద్ద గోశాల ఉంది.. లంకారాజ్యానికంతటికీ అదే ఏకైక డైరీఫారమ్.. శ్రీలంకలోనే కలుతర అన్న ప్రాంతంలో రావణుడికి మరో కోట ఉండేది.. ఈ కోట ఇప్పుడు సముద్ర గర్భంలో కలిసిపోయిందని చెప్తారు.. దీనికోసం లంక సర్కారు పరిశోధిస్తోంది.. ఇప్పుడు ఈ ప్రాంతంలో లైట్ హౌస్ కనిపిస్తుంది.
ఇక్కడ హనుమంతుడి గురించి కొంత చెప్పుకోవాలి.. లంకాదహనం చేశాక ఓ ప్రాంతంలో కాసేపు రెస్ట్ తీసుకున్నాడు.. దాన్ని ఇప్పుడు రామ్ బోడా అంటారు.. అక్కడ చిన్మయ మిషన్ వాళ్లు అతి పెద్ద ఆలయ నిర్మాణం చేశారు..
రామాయణంలో మనకు తెలిసిన రావణుడు వేరు..లంకలో కనిపిస్తున్న రావణుడు వేరు.. ఆయన సీతను ఎత్తుకుపోయిన సంగతే చాలామందికి తెలుసు. ఆయన పండితుడన్న సంగతి కొందరికి తెలుసు.. కానీ, రావణుడిలో మనకు అంతు చిక్కని అనేక కోణాలు ఉన్నాయి.
ఇలా చెప్పుకుంటూ పోతే రావణుడిలో అనేక కోణాలు బయటపడతాయి. తన భార్య మండోదరితో సరదాగా ఆడుకోవటానికి చెస్ను కనుక్కొన్నాడట. ఆమెతో కలిసి వీణ అద్భుతంగా వాయించేవాడట రావణబ్రహ్మ.
రావణుడికి సంబంధించి అయిదు విమానాశ్రయాలను లంక సర్కారు కనుక్కొందని చెప్పుకున్నాం.. గుర్లపోతలో విమాన మరమ్మతు కర్మాగారం ఉంది.. వాల్మీకి రామాయణంలోనూ ఈ గుర్లపోత ప్రస్తావన ఉంది. రావణుడి విమానం పెద్ద నెమలి ఆకారంలో ఉండేదిట.. దీనికి సింహళభాషలో గుర్లపోత అంటారు..అంటే పక్షి వాహనం అని అర్థం. విమానాన్ని సింహళ భాషలో దండు మోనరా అంటారు.. అంటే ఎగిరే నెమలి అని అర్థం.
రావణ లంకానగరం అపూర్వమైంది.. అపూర్వ నిర్మాణాన్ని కలిగి ఉన్నది.. లంకానగరం శత యోజన విస్తీర్ణంలో నిర్మించారని రామాయణం చెప్తోంది.. ఏడు ప్రాకారాలు, ఎనిమిది ద్వారాలు.. మూడు కందకాలతో అత్యంత సురక్షితంగా లంకా నగరాన్ని నిర్మించాడట రావణుడు.. ఆనాటి లంకలో నాలుగు లక్షల వీధులు ఉండేవిట.
లంకలో చాలా ప్రాంతాల్లో అనేక గుహలు, సొరంగాలు కనిపిస్తాయి. ఇవన్నీ రావణ కాలం నాటివే. రావణుడి ఆర్కిటెక్చరల్ ప్రతిభకు ఇవి నిదర్శనంగా నిలుస్తాయి. ఈ సొరంగాలు లంకలోని అన్ని పట్టణాలకు ఒకదానితో మరొకటి లింక్ కలిపే నెట్వర్క్ వ్యవస్థను కలిగి ఉన్నాయి.
ఈ సొరంగాలు తొందరగా ఒకచోటి నుంచి మరోచోటికి తరలివెళ్లేందుకు సరైన రవాణా వ్యవస్థను కలిగి ఉన్నాయి.
ఈ సొరంగాలు సహజంగా ఏర్పడినవి కావు.. ప్రతి సొరంగం మానవ నిర్మితమేనని స్పష్టంగా తెలుస్తుంది.. రావణ గుహకే దాదాపు ఏడు వందల దాకా కిటికీలు ఉన్నాయి,
ఎంత గొప్ప నగర నిర్మాణం.. ఎంత సాంకేతిక పరిజ్ఞానం.. ఎంత గొప్ప నాగరికత.. భారత దక్షిణా పథాన కనీవినీ ఎరుగని సాంస్కృతిక వైభవం విలసిల్లిన లంకానగరం ఎంత దారుణంగా ధ్వంసమైంది? తన ప్రజలకు ఎలాంటి కష్టం లేకుండా చేసిన సార్వభౌముడు ఎలా పతనమయ్యాడు..
పధ్నాలుగేళ్ల వనవాసానికి అయోధ్య నుంచి బయలు దేరిన రామచంద్రుడు చిత్రకూటం మీదుగా పంచవటికి వెళ్లాడు.. అప్పటికి దండకారణ్యం దాకా రావణుడి ఆధిపత్యం కొనసాగినట్లు తెలుస్తుంది.. దండకారణ్యంలో రావణుడి గవర్నర్ ఖరుడు పరిపాలన సాగించాడు.. రాముడు ఖరదూషణులను ఇక్కడే చంపాడు..
పంచవటి నుంచి కిష్కింధకు వెళ్లిన రాముడు అక్కడ వానర సైన్యాన్ని కలుసుకున్నాడు.. ఆ సైన్యం తోనే శ్రీలంకకు చేరుకున్నాడు.. భారతీయ నిర్మాణ రంగంలోనే అపురూపమైన సేతువును రాముడు రామేశ్వరం మీదుగా లంకలోని తలైమన్నార్ దాకా నిర్మించాడు. నీటిపై తేలే రాళ్లతో వానర సైన్యంలోని నీలుడి పర్యవేక్షణలో ఈ సేతు నిర్మాణం సాగింది.. ఇదేం విచిత్రం కాదు.. నీటిపై తేలే ఇటుకలను ఇప్పుడు వరంగల్లోని రామప్ప దేవాలయ గోపురంలోనూ మనం చూడవచ్చు.. లైట్వెయిట్ స్టోన్స్, నీరు, ఇసుక.. పునాదులపై నిర్మాణాలు భారతీయులకే సాధ్యమైన విద్యలు.. రామ సేతువు ఇవాళ్టికీ సుమారు ౩౦ కిలోమీటర్ల మేర మనకు కనిపిస్తుంది.
శ్రీలంక సరిహద్దులకు చేరుకున్నాక రాముడు తన సైన్యంతో నీలవరై పుత్తుర్ దగ్గర మొదట ఆగాడట.. అక్కడ రాముడు తన సైన్యం కోసం సృష్టించిన నీటి జల ఇప్పటికీ కనిపిస్తుంది..
నీలవరై పుత్తుర్ దగ్గర నుంచి లగ్గల అన్న ప్రాంతానికి రాముడి సైన్యం తరలింది.. లగ్గల అంటే టార్గెట్ రాక్ అని అర్థం.. ఈ పర్వత పై భాగం నుంచి రావణ సైన్యం రాముడి గురించిన సమాచారాన్ని అందించింది.. ఈ ప్రాంతం భౌగోళికంగా ఉత్తర లంకలో అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉంటుంది. ఈ ప్రాంతానికి ఈశాన్య భాగంలో తిరుకోణేశ్వరం ఉంది.. అటు వాయవ్య దిశలో తలైమన్నార్ ఉంటుంది.. రామసేతువు లంకకు కలిపింది ఇక్కడే.. ఈ తిరుకోణేశ్వరంలోనే రావణుడు తపస్సు అదేనండీ ఇవాళ మనం అనే మెడిటేషన్ చేసేవాడు..
ఈ యుద్ధ భూమిలోనే భీకరంగా రామరావణుల పోరాటం జరిగింది. రామబాణానికి దశకంఠుడు నేలకొరిగాడు.. రాక్షస సంహారం జరిగింది. సుందరలంక స్మశానంగా మారిపోయింది.. రాముడు వనవాసానికి వెళ్లేనాటికా ఆయన వయసు ౨౫ సంవత్సరాలు.. రావణున్ని హతమార్చేప్పటికి రాముడు ౩౯ ఏళ్ల వాడు.
రావణ సంహారంతో రామాయణం ముగియలేదు.. యుద్ధం తరువాత రాముడు సీతాలక్ష్మణ సమేతంగా బయలు దేరినప్పుడూ లంకలోని కొన్ని ప్రాంతాలలో ఆగాడు.. సేద తీరాడు.. పరమేశ్వరుని కొలిచాడు.
రావణ వధ తరువాత సీతారామలక్ష్మణులు పుష్పకంలో అయోధ్యకు బయలు దేరుతూ వందారుమూలై అన్న ప్రాంతంలో కాసేపు ఆగారు.
వందారుమూలైలో ఉన్నప్పుడు రాముడికి అనుమానం కలిగింది.. రావణుడు బ్రాహ్మణుడు.. అతణ్ణి చంపినందుకు తనకు బ్రహ్మహత్యాదోషం చుట్టుకుంటుంది కదా అన్న సందేహంతో దీనికి పరిష్కారం చెప్పమంటూ పరమేశ్వరుని కోరాడు.. అప్పుడు శివుడు నాలుగు ప్రాంతాలలో శివలింగాన్ని ప్రతిష్టించి పూజించమని రాముడికి సూచించాడట.. దీంతో రాముడు లంకలో మానావారి అన్న ప్రాంతంలో తొలి శివలింగాన్ని ప్రతిష్ఠించాడు.. దీన్ని రామలింగ శివుడని కొలుస్తారు.. ఆ తరువాత తిరుకోణేశ్వరంలో, అక్కడి నుంచి తిరుకేదారేశ్వరంలో మరో రెండు శివలింగాలను ప్రతిష్ఠించాడు... చివరగా భారత భూభాగంలో ఇప్పుడున్న రామేశ్వరంలో మరో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు..
పుష్పకంపై తిరిగి వెళ్తూ, రాముడు రామసేతువును పాక్షికంగా ధ్వంసం చేసి వెళ్లాడని కూడా కథనం చెప్తారు.. మొత్తం మీద రావణ లంక భారతీయ నాగరికతలోని అనేక కొత్త కోణాలను వెలికి తీస్తున్నది..
రామాయణం- ప్రాచీన ప్రదేశాలు - ఆధునిక నామధేయాలు
:::::::::::::::::::::::::::::::::::::
1. భగీరథుడు గంగను భువికి దింపిన స్థలం - గంగోత్రి, ఉత్తరాఖండ్
2. కపిల మహర్షి ఆశ్రమం, (శ్రీరాముని పూర్వీకులు సగర చక్రవర్తి తనయులు 60,000 మంది కాలి బూడిదైన స్థలం. గంగానది వారి భస్మరాసుల మీద ప్రవహించి వారికి పుణ్యలోకాలు ప్రసాదించి బంగాళాఖాతంలో కలుస్తుంది) - గంగాసాగర్, వెస్ట్ బెంగాల్
3. కాంభోజ రాజ్యం - ఇరాన్ (శ్రీరాముని ముత్తాత రఘు మహారాజు సామ్రాజ్యం ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, కజఖిస్తాన్, దాటి యింతవరకూ విస్తరించింది).
4. రక్షస్థలం (రావణుడు తన పది తలలు నరికి శివున్ని పూజించి వరాలు పొందిన చోటు)- లాంగకో, టిబెట్, చైనా
5. పరమశివుని ఆత్మలింగాన్ని గణేశుడు నేలవైచిన చోటు - గోకర్ణ, కర్ణాటక
6. సీతాదేవి భూమిలో లభించిన చోటు - సీతామర్హి, బీహార్
7. మిథిల (సీతాదేవి పుట్టినిల్లు) - జనక్ పూర్, నేపాల్.
8. కోసలదేశం - రాజధాని అయిన అయోధ్య నుండి నేపాల్ లోని కొన్ని ప్రాంతాల వరకు ఉన్న ప్రదేశం.
9. దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేసిన స్థలం - ఫైజాబాద్, ఉత్తర్ ప్రదేశ్.
10. సరయూ నది (ఈ నదీ తీరంలోనే అయోధ్య నిర్మితమైనది) - ఘాఘర నది.
11. అయోధ్య / సాకేతపురం (శ్రీరాముని జన్మస్థలం, బంగారు సీతతో అశ్వమేధ యాగం చేసిన స్థలం, సరయూ నదిలో మునిగి వైకుంఠం చేరిన స్థలం) - అయోధ్య, ఉత్తర్ ప్రదేశ్.
12. తాటక వధ జరిగిన ప్రదేశం - బక్సర్, బీహార్
13. అహల్య శాపవిమోచన స్థలం - అహిరౌలి, బీహార్
14. కుశనాథపురం (విశ్వామిత్రుడు యాగం చేసిన స్థలం) - సుల్తాన్ పూర్, ఉత్తర్ ప్రదేశ్
15. గుహుడు సీతారామ లక్ష్మణులను కలిసిన చోటు - శృంగబేరిపురం, అలహాబాద్ దగ్గర
16. దండకారణ్యం - చత్తీస్ ఘడ్ లోని బస్తర్ జిల్లా, ఆంధ్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్ లలోని కొన్ని ప్రాంతాలు.
17. చిత్రకూటం (సీతారామ లక్ష్మణులు వనవాసం చేసిన చోటు) - సాత్న జిల్లా, మధ్యప్రదేశ్.
18. పంచవటి (శూర్పణఖ ముక్కూచెవులు కోసిన స్థలం) - నాసిక్, మహరాష్ట్ర.
19. కబంధాశ్రమం - కర్దిగుడ్, బెల్గావి, కర్ణాటక.
20. శబరి ఆశ్రమం - సర్బన్, బెల్గావి, కర్ణాటక.
21. హనుమంతుడు రామ లక్ష్మణులను మొదటిసారిగా కలసిన ప్రదేశం - హనుమాన్ హళ్ళి, కొప్పాళ, కర్ణాటక.
22. ఆంజనేయ పర్వతం (హనుమంతుడి జన్మస్థలం), కిష్కింద (సుగ్రీవుని రాజ్యం), ఋష్యమూక పర్వతం -తుంగభద్ర నదీతీర ప్రాంతం, హంపి దగ్గర, కర్ణాటక.
23. విభీషణుడు రాముణ్ణి శరణు కోరిన స్థలం - ధనుష్కోటి, తమిళనాడు.
24. శ్రీరాముడు వానరసైన్యం తో వారధి నిర్మించిన చోటు- రామేశ్వరం, తమిళనాడు
25. రత్నద్వీపం / సింహళం / లంక - శ్రీలంక.
26. అశోకవనం (సీతాదేవి బందీగా ఉన్న ప్రదేశం) - కాండీ దారిలోని సీత ఏళియ, శ్రీలంక.
27. శ్రీరాముడు రావణుని వధించిన చోటు - దునువిల్ల, శ్రీలంక.
28. సీతాదేవి అగ్నిప్రవేశం చేసిన ప్రాంతం - దివిరుంపోల, శ్రీలంక.
29. వాల్మీకి ఆశ్రమం/ కుశ లవుల జన్మ స్థలం / సీతాదేవి భూదేవిలో ఐక్యమైన స్థలం - ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ నుంచి 30 మైళ్ళ దూరంలోని బితూర్.
30. కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) - కుశార్, పాకిస్తాన్.
31. లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) - లాహోర్, పాకిస్తాన్
32. తక్షశిల (శ్రీరాముని తమ్ముడు భరతుని పెద్దకొడుకు తక్షుడు నిర్మించిన నగరం) - తక్షశిల, పాకిస్తాన్
33. పుష్కలావతి/ పురుష పురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం) - పెషావర్, పాకిస్తాన్.
. . . . . జై శ్రీరామ్ . . . . .

Tuesday 17 January 2017

హనుమత్కల్యాణం


                ధర్మ సందేహాలు  సమాధానాలు  

  రామాయణంలో హనుమంతుని  కల్యాణం   విషయం  లేదు  కదా  !
సువర్చలా  వృత్తాంతం   ఎక్కడిది    అని కొందరు
ప్రశ్నిస్తారు  .... సమాధాన మేమిటంటే  ....
హనుమంతుని  చరిత్ర. అంతా  రామాయణంలో
లేదు  కథకు  అవసరమైన. మేరకే  వాల్మీకి
స్వీకరించాడు  అన్నీ  యుగాలలోనూ చిరంజీవిగా
ఉన్న. హనుమంతుని సంపూర్ణ.  చరిత్ర కేవలం
త్రేతాయుగానికి   చెందిన. రామాయణం లో  ఉండే
అవకాశం  లేదు  అలాగే   హనుమంతుడు  బ్రహ్మచారి
అంటారు  ,  ఈ. వివాహం  ఎలా  జరిగిందనేది
మరో   ధర్మసందేహం  బ్రహ్మచర్యం  నాలుగు
రకాలు ,  గాయత్రం   బ్రహ్మం  ప్రజాపత్యం  .
బృహన్  అని  వాటికి   పేర్లు  ,  భార్యతో  నియమ
పూర్వక. జీవితం  గడిపేవారిని  ప్రజాపత్య. బ్రహ్మ --
చారులంటారు  ,  బ్రహ్మచర్య. నియమాలను  సరిగా
అర్ధం చేసుకోగలగాలి  ,   హనుమంతుడు 
భవిష్యద్ర్బహ్మ. ,  ఆయన. బ్రహ్మస్తానం  పొందినవాడు
సువర్చలాదేవి  సరస్వతి స్థానం పొందుతుంది  ,
దేవతల. భార్యలంటే  అర్ధం  వారి  శక్తులే  బ్రహ్మచర్య
నిష్టాగరిష్టునికి  ఉండే  శక్తి  వర్చస్సు  , సువర్చస్సు
ఆమెయే   సువర్చలా  దేవి  .. 
              కళ్యాణ. వైభోగం  
సువర్చలాపతిష్షష్ఠః  అన్నారు  హనుమంతునికి
నవావతారాలు  ఉన్నాయి  ,  వాటిలో  ఆరోది
సువర్చలాంజనేయ. అవతారం  ,  సువర్చలా హనుమత్
ద్వాదశక్షరీ  మంత్రం మ౦త్రశాస్ర్త౦లో  ఉ౦ది.
ధ్వజదత్త , కపిలాది భక్తి  ఉపాసకులకు సువర్చలాహనుమత్ సాక్షాత్కార౦ జరిగి౦ది.దేశ౦ నలుమూలలా  మాత్రమే కాకు౦డా విదేశాలలో కూడా సువర్చలా౦జనేయ విగ్రహాలున్నాయి.  బ౦దరు
పరాసుపేటలో  శివాజీగురువు సమర్ధ రామదాసు
స్వామి 16వ శతాబ్దిలో ప్రతిష్ఠించినది సువర్చలా౦-
జనేయ. ఆలయమే . అనేక హనుమాదాలయాలలో
వైశాఖ, జ్యేష్ఠ మాసాల్లో కల్యాణాలు నిర్వహించడ౦,
సువర్చలా౦జనేయుల ఉత్సవమూర్తులను సిద్ధ౦
చేసుకోవడం  ఆనవాయితీగా వస్తోంది.  హనుమ-
దుపాసకులు ఎ౦దరో  హనుమత్కల్యాణ౦ నిర్వహిస్తూ
ఉ౦టారు.  మార్గశిర శుద్ధ త్రయోదశినాటి హనుమద్ర్వత
సమయంలో సువర్చలా౦జనేయ కలశాలను ఉ౦చి
పూజిస్తారు. సువర్చలా హనుమత్ గాయత్రి మ౦త్ర౦
జపి౦చడ౦ వల్ల వివాహం అయిన వారెందరో ఉన్నారు.
గృహస్ధులైన వారికి సువర్చలా౦జనేయ సేవ సకల
శ్రేయేభివృద్ధులనూ కలిగిస్తుంది. 
మళ్ళీ కలుద్దాం     సెలవు  
హనుమత్కల్యాణం విషయాలు  , 2 వ. భాగములో

Friday 13 January 2017

రావణుడు చనిపోయేటప్పుడు లక్ష్మణుడి చెవిలో చెప్పిన రహస్యాలు

రావణుడు చనిపోయేటప్పుడు లక్ష్మణుడి చెవిలో చెప్పిన  రహస్యాలు ఇవే …తప్పకుండా తెలుసుకోవాలి..ఇలా చెబుతాడు. బ్రాహ్మనులలోని పండితుడైన రావణుడి దగ్గరకు వెళ్లి, ఎవరికీ తెలియని నాలుగు మంచి విషయాలు తెలుసుకోమని చెబుతాడు. అప్పుడు రావణుడు ఏమి చెప్పాడంటే…
.మన రధసారధితో , కాపలావాడితో, వంట వాడితో నీ తమ్ముడితో ఎప్పుడు స్నేహంగానే మెలగాలి. వాళ్ళతో గాని శతృత్వం పెట్టుకుంటే, వారు ఎప్పుడైనా , ఎటునుంచి అయినా మనకు హాని చేస్తారు. ఒక్కొక్క సమయంలో వాళ్ళు మన ప్రాణాలు తియ్యడానికి కూడా వెనకాడరు.
.ఎప్పుడూ విజయం నిన్నే వరిస్తుంది కదా అని ఎల్లప్పుడూ నువ్వే గెలుస్తావని అనుకోకు.
.నీతో ఉంటూ నిన్ను విమర్శించే వారిపై నువ్వు ఎక్కువ నమ్మకం పెట్టుకోవచ్చు. నిన్ను పొగిడే వారిని అస్సలు నమ్మకూడదు..నీ శత్రువు చిన్నవాడు, తక్కువ వాడు అని తక్కువ అంచనా వెయ్యవద్దు. ఎవరి వెనుక ఎంత భలం ఉందొ ఎవరికి తెలుసు. నేను హనుమంతుడిని తక్కువ అంచనా వేసి చివరికి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాను.
.దేవుడుని ప్రేమించవచ్చు లేదా ద్వేషించ వచ్చు కాని ఏదైనా కూడా అపారమైన దృడ నిశ్చయంతో ఉండాలి.
.రాజుకు యుద్ధం లో గెలవాలని కోరిక ఉండాలి కాని ఎప్పటికీ అత్యాశాపరుడై ఉండకూడదు.
.ఇతరులుకు, సైన్యానికి అవకాశం ఇచ్చి, రాజు అలసిపోకుండా పోరాడతేనే  విజయం సొంతం అవుతుంది.
ఈ మాటలు చెబుతూ ప్రాణాలు వదిలేస్తాడు రావణుడు. ఆయన చెప్పిన మాటలు మన జీవితానికి కూడా వర్తిస్తాయి. ఎంతో విలువైనవి రావణుడు ఆ సమయంలో చెబుతాడని, అవి లోకానికి ఉపయోగపడతాయనే రాముడు లక్ష్మనుడిని వెళ్లి తెలుసుకోమని ఉంటాడు. ఇప్పుడు మనం తెలుసుకుని నలుగురికి తెలియజేద్దాం.

Thursday 12 January 2017

రావణాసురుడిని ఓడించిన మాంధాత.



రామాయణంలో రాముడి చేత సంహరించబడిన రావణుడు.. అంతకుముందే మరొకరి చేతిలో ఓడిపోయాడు. అతడి పేరే మాంధాత. ఇతడు యవనాశ్వుని కుమారుడు. భ్రుగు మహర్షి దాచి ఉంచిన మంత్రజలం సేవించినందువల్ల యవనాశ్వుని భార్యకు మాంధాత జన్మిస్తాడు. చిన్నతనం నుంచే సాహసాలు చేయడం, యుద్ధాల్లో చేసే పోరాటాలను నేర్చుకునేవాడు. ఇతను ఎంతటి బలవంతుడటంటే.. 12వ ఏటలోనే రాజ్యాభిషిక్తుడవుతాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న రావణుడు.. అతనిని ఓడించాలని నిర్ణయించుకుంటాడు. తనకంటే మించిన బలవంతుడు మరొకరు లేరని నిరూపించడం కోసం మాంధాతో యుద్ధానికి దిగేందుకు రావణుడు సన్నద్ధమవుతాడు.
రావణుడు అనుకున్నట్లుగానే అతనితో యుద్ధానికి దిగుతాడు. మాంధాత, ఇతనికి మధ్య భీకరమైన యుద్ధం కొనసాగుతుంది. మాంధాతను ఎలాగైనా ఓడించాలనే కసితో తాను ముందుగానే ఏర్పరుచుకున్న పథకాలను ప్రయత్నించసాగాడు కానీ.. అతని బలం ముందు అవి ఏమాత్రం పనిచేయవు. ఎన్నిరకాలుగా ప్రయత్నించిన రావణుడు అతనిని ఓడించలేకపోయాడు. అయినప్పటికీ ఓటమిని అంగీకరించకుండానే అతనితో అలాగే పోరాడుతాడు. చివరికి మాంధాత చేతిలో రావణుడు ఓడిపోతాడు. అప్పుడు అతని బలమెంతో తెలుసుకున్న రావణుడు.. తనని ఓడించడం కష్టమని తెలుసుకుంటాడు. అయితే.. ఇంతలోనే బ్రహ్మ, ఇంద్రుడు జోక్యంచేసుకుని... మంధాత, రావణునికీ మధ్య సంధి కుదుర్చుతారు. దాంతో ఇద్దరూ ఒక్కటవుతారు. చివరికి రావణుడు తిరిగి లంకకు చేరుకుంటాడు.🙏🌺🙏

Sunday 18 December 2016

శివధనుస్సు

Shiva dhanadu


రాముడు అవతారపురుషుడు అని అందరికీ తెలిసినదే కదా! ఆయన ఏమి చేసినా ఒక మానవుడు ఎలా బ్రతకాలి తద్వారా మోక్షాన్ని ఎలా పొందాలి అని చెప్పడానికే చేశాడు. ఆయన ప్రతీ కదలికకీ అంతరార్థం, పరమార్థం ఉన్నాయి. అలానే శివధనుస్సు విషయానికి వస్తే…..

అకార ఉకార మకారములు ప్రణవము, ప్రణవం
ధనుహు, శరోహ్యాత్మ, బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే
అప్రమత్తేన వేధ్ధవ్యం శరవత్ తన్మయో భవేత్
అన్నారు.

అంటే…. అ, ఉ, మ కలిస్తేనే ప్రణవ నాదమయిన ఓం కారం వస్తుంది. ధనుస్సు (ప్రణవం) అంటే ఈ ఓంకారం అనమాట. శరము (బాణము) అంటే ఆత్మ. బాణముతో ధనుస్సును ఎక్కుపెట్టినప్పుడు కనిపించే లక్ష్యమే బ్రహ్మ. ఇక్కడ బ్రహ్మ అనగా పరబ్రహ్మ లేదా పరమాత్మ. బాణాన్ని ఎప్పుడూ అప్రమత్తంగా, చిత్త శుద్ధితో కొడితేనే లయమయ్యి లక్ష్యాన్ని చేరుతుంది. ఇది ధనుస్సు యొక్క అంతరార్థం.

ఇక్కడ శివధనుస్సు ఆవిర్భావం గురించి మరికొన్ని విషయాలను తెలుసుకోవాలి. ఈ శివధనుస్సును శివుడు త్రిపురాసురుని సంహరించడం కోసం సృష్టించాడు అన్నది అందరికీ తెలిసినదే! ఈ త్రిపురాసురుడు ఒక జీవుడుని ప్రతిబింబిస్తాడు అని అంతరార్థం ఉంది. అదెలా అంటే, త్రిపురాసురుడు పాలించే మూడు పురములు అయినటువంటి కంచు, వెండి, బంగారములు వరుసగా జీవి యొక్క స్థూల (విశ్వ), సూక్ష్మ (తైజస), కారణ (ప్రాజ్ఞ) శరీరములను ప్రతిబింబిస్తాయి.

స్థూల శరీరం అంటే బాహ్యముగా ఈ విశ్వానికి కనిపించే శరీరం. జీవుడు ఈ శరీరంలో ఉన్నప్పుడు విశ్వుడు అంటారు. ఈ దేహానికి కంచులాగా విలువ లేదు.

సూక్ష్మ శరీరం అంటే కలలో ఉన్నప్పుడు మనకి కనిపించే శరీరం. అది కేవలం ఆలోచన తప్ప అక్కడ ఒక కాయం అన్నది ప్రస్ఫుటముగా ఉండదు. జీవుడు ఈ శరీరంలో ఉన్నప్పుడు తైజసుడు అంటారు. ఈ శరీరం వెండిలాంటిది.

కారణ శరీరం అంటే నేను, నాది అనుకునేది లోపల ఏదయితే ఉందో అది. దీనినే అంతరాత్మ అంటారు. ఇది ఒక రూపం కోసం మాత్రమే పై రెండు రకాల శరీరాల మీద ఆధారపడుతుంది. జీవుడు ఈ శరీరంలో ఉన్నప్పుడు ప్రాజ్ఞుడు అంటారు. ఇది బంగారంలా చాలా విలువయినది.

శివుడు ప్రణవమనే ధనస్సుతో, ఈ మూడు పురములు అనబడే మూడు రకాల శరీరాలని ఒకేసారి ఛేదించాడు. అప్పుడే త్రిపురాసురుడు అనబడే ఈ జీవుని సంహారం జరిగి మరు జన్మ ఉండదు.
ఈ మూడే కాక, మహాకారణ శరీరం అని ఒకటి ఉంది. అది అందరూ గాఢ నిద్రలో అనుభవించే స్థితి. దీనినే తులీయావస్థ అంటారు. ఈ స్థితిని మనం గుర్తించ గలిగి ఆ పరమాత్మలో లయం అవటాన్నే మోక్షం అంటారు. జీవుడిని ఆ మోక్షానికి చేరువ చేసేదే ఓం కారం అయిన ధనుస్సు.

శివుడు ఈ శివధనుస్సుని త్రిపురాసుర సంహారానంతరం దేవరాతుడు అనబడే జనకుని వంశ పూర్వీకునికి ఇవ్వగా ఆ నాటి నుండి వారి వద్ద పూజలందుకుంటూ ఉంది. దీనినే శ్రీరాముడు స్వయంవరంలో విరిచి అప్పుడు సీతమ్మ చేయి అందుకుంటాడు. అనగా గృహస్థాశ్రమంలోకి అడుగుపెట్టే ముందు దీనిని విరిచాడు కదా! ఒక మగవాడికి ధర్మార్థ కామ మోక్షాలు పొందడానికి అనువయిన, ఉత్తమమయినది ఈ గృహస్థాశ్రమం. ఇందాకా చెప్పుకున్నట్టు ధనుస్సు అంటే ప్రణవ నాదమయిన ఓంకారం కనుక దానిని విరవటం అంటే ఓం కారాన్ని విడగొట్టడం. అలా విడగొడితే వచ్చేవి మళ్ళీ అ, ఉ, మ. వీటిల్లో
అ – అంటే బ్రహ్మం లేదా పరబ్రహ్మం అంటే పరమాత్మ అయిన శివుడు
ఉ – అంటే అమ్మవారు సాక్షాత్తు శివుని అర్థ భాగం
మ – అంటే జీవుడు అంటే నేను అనే మగవాడు

ఏ మగవాడయినా పరమాత్మలో చేరడానికి కావలసిన మాధ్యమం అర్థభాగమయిన, అర్థాంగి అయిన భార్య. మనకున్న ధర్మార్థకామ మోక్షాలలో….
ధర్మం – ధర్మానికి ప్రతిరూపం భార్య ఆవిడ లేకపోతే ఏ పూజలకీ, యాగాలకీ, జపాలకీ, తపస్సులకీ జీవుడు పనికిరాడు.
అర్థం – మగవానికి సంతాన ఉత్పత్తి కోసం భార్య కావాలి.
కామం – తనకు కావలసిన కోర్కెలు తీర్చుకోవడానికి భార్య కావాలి.
ఇలా ఎప్పుడయితే, ఏ మగవాడయితే ధర్మాన్నీ, అర్థాన్నీ పాటిస్తూ, ఈ రెండూ చెడకుండా కామాన్ని అనుభవిస్తాడో అతనే మోక్షాన్ని పొందే అర్హత సంపాదిస్తాడు.

రాముడు వీటన్నిటినీ ఆలంబిస్తూ ధనుస్సుని విరిచి తను ఈ గృహస్థాశ్రమంలోకి ప్రవేశించే అర్హతని పొందాడు. కనుకనే అతను సీతకి తగినవాడు, అన్నిటినీ జయించినవాడు కనుక అందరూ సంతోషిస్తారు.

శివ ధనుస్సు లాగానే విష్ణు ధనుస్సు కూడా ఉంది. అది పరశురాముని వద్ద ఉంటుంది. ఎప్పుడయితే రాముడు శివ ధనుస్సుని విరిచి సీతని పరిణయమాడతాడో, అప్పుడు అది తెలిసిన పరశురాముడు ఈ విష్ణుధనుస్సుని, ఆయన శక్తిని కూడా రామునికి ఇచ్చేసి హరిహరులని ఏకం చేస్తాడు.🙏🌺🙏

Tuesday 7 June 2016

వాల్మీకి రామాయణం 31వ దినము

వాల్మీకి రామాయణం
31వ దినము, బాలకాండ

వాళ్ళు చెప్పినదానికి శంకరుడు సరే అన్నాడు, కాని ఇప్పటికే రేతస్థానము నుంచి నా తేజస్సు కదిలింది, ఇప్పుడు దాన్ని ఎవరు భరిస్తారు, దాన్ని ఎక్కడ వదిలిపెట్టను అని శంకరుడు అడిగాడు. అప్పుడు ఆ దేవతలు.....
యత్ తేజః క్షుభితం హి అద్య తద్ ధరా ధారయిష్యతి |

మీ తేజస్సుని భూమి భరిస్తుంది, కావున భూమి మీద వదిలిపెట్టండి అన్నారు. శంకరుడు అలానే భూమి మీద తన తేజస్సుని వదిలిపెట్టాడు. వదిలిన ఆ తేజస్సు భూమి అంతా వ్యాపించింది. ఇంతలో పార్వతీదేవి బయటకి వచ్చి, నాకు బిడ్డ పుట్టకుండా చేసి మీరు శంకర తేజస్సుని భూమి మీద పతనం చేశారు. కావున.....

అపత్యం స్వేషు దారేషు న ఉత్పదయితుం అర్హథ |
అద్య ప్రభృతి యుష్మాకం అప్రజాః సంతు పత్నయః ||
ఏవం ఉక్త్వా సురాన్ సర్వాన్ శశాప పృథివీం అపి |
అవనే న ఏక రూపా త్వం బహు భార్యా భవిష్యసి ||
న చ పుత్ర కృతాం ప్రీతిం మత్ క్రోధ కలుషీకృతా |
ప్రాప్స్యసి త్వం సుదుర్మేధే మమ పుత్రం అనిచ్ఛతీ ||

మీ దేవతలు అందరూ వచ్చి నాకు బిడ్డలు కలగకుండా చేశారు కాబట్టి మీకెవరికీ మీ భార్యలందు బిడ్డలు పుట్టరు. నా భర్త అయిన శంకరుడి తేజస్సుని భరించడానికి భూమి ఒప్పుకుంది కాబట్టి, ఇకనుంచి భూమి అనేక రూపాలు పొందుతుంది, ఒకే కాలంలో భూమికి అనేక భర్తలుంటారు, భూమి తన కొడుకుల వలన సిగ్గుతో తల వంచుకుంటుందని శపించింది. ఇది విన్న దేవతలు తలలు వంచుకొని తమ తమ స్థానాలకి వెళ్ళిపోయారు.
వ్యాపించిన ఆ శంకరుడి తేజస్సుని భూమి కూడా తట్టుకోలేకపోయింది. అప్పుడు దేవతలు అగ్నిదేవుడిని వాయువుతో కలిసి ఈ రుద్ర తేజస్సుని తనయందు పెట్టుకోమన్నారు. అప్పుడు అగ్ని ఆ తేజస్సుని తనలో పెట్టుకున్నాడు.

వాల్మీకి రామాయణం 32వ దినము

వాల్మీకి రామాయణం
32వ దినము, బాలకాండ.

శంకరుడు పార్వతీదేవితో తపస్సు చేసుకోడానికి పశ్చిమ దిక్కుకి వెళ్ళిపోయాడు. అదే సమయంలోతారకాసురుడు అనే రాక్షసుడు, తను పార్వతీ పరమేశ్వరుల బిడ్డడి చేతిలోనే చనిపోయేటట్టు వరం పొందాడు. ఇది తెలిసిన దేవతలకి ఏమి చెయ్యాలో తెలీక బ్రహ్మగారి దెగ్గరికి వెళ్లారు. అప్పుడు బ్రహ్మగారు ఆలోచించి, హిమవంతుడు - మనోరమల కుమార్తెలైన గంగా - పార్వతులకి తేడా లేదు, కావున పార్వతీదేవి అక్క అయిన గంగలో ఈ తేజస్సుని విడిచిపెడితే, పార్వతీదేవికి కోపం రాదు. కాబట్టి ఆ శివ తేజస్సుని గంగలో విడిచిపెట్టమన్నారు. అప్పుడా దేవతలు గంగమ్మ దెగ్గరికి వెళ్ళి, దేవకార్య నిమిత్తము నువ్వు అగ్ని దెగ్గరనుంచి శివ తేజస్సుని స్వీకరించి గర్భం ధరించాలి అన్నారు. దేవతా కార్యము కనుక గంగ సరే అన్నది. అప్పుడు గంగ ఒక అందమైన స్త్రీ రూపం దాల్చి ఆ తేజస్సుని అగ్ని నుండి స్వీకరించింది. శివ తేజస్సు గంగలో ప్రవేశించగానే గంగ కేకలేసింది. ఈ తేజస్సుని నేను భరించలేను, నన్ను ఏమి చెయ్యమంటారు అని అడిగింది. అప్పుడు అగ్నిదేవుడు చెప్పిన విధంగా గంగ ఆ తేజస్సుని కైలాస పర్వతం పక్కనున్న భూమి మీద వదిలింది. 

అలా భూమి మీద పడ్డ ఆ తేజస్సు యొక్క కాంతివంతమైన స్వరూపం నుంచి బంగారం, వెండిపుట్టాయి, ఆ తేజస్సు యొక్క మలం నుంచి తగరము,సీసము పుట్టాయి, ఆ తేజస్సు యొక్క క్షారం నుంచి రాగి,ఇనుము పుట్టాయి, మిగిలిన పదార్థం నుంచి మిగతా ధాతువులన్ని పుట్టి గనులుగా ఏర్పడ్డాయి. అక్కడ బంగారు పొదలుగా, శరవణ పొదలు పుట్టాయి. అక్కడే ఉన్న తటాకం నుండి ఒక పిల్లవాడి ఏడుపు వినిపించింది. పుట్టిన ఆ పిల్లాడికి పాలు ఎవరు పడతారు అని దేవతలు ఆలోచిస్తుండగా, పార్వతీదేవి అంశ అయిన కృత్తికలు ఆ పిల్లవాడికి మా పుత్రుడిగా కార్తికేయుడు( కృత్తికల పుత్రుడు ) అని పిలవాలి, అలా అయితే పాలు పడతాము అన్నారు. దేవతలు సరే అన్నారు.

తతః తు దేవతాః సర్వాః కార్తికేయ ఇతి బ్రువన్ |

పుత్రః త్రైలోక్య విఖ్యాతో భవిష్యతి న సంశయః ||

ఈ మాట విన్న కృత్తికలు ఆనందంగా పాలు పట్టారు. ఆ పుట్టిన పిల్లవాడు 6 ముఖాలతో పుట్టాడు, ఏక కాలంలో 6 కృత్తికల స్తన్యమునందు 6 ముఖాలతో పాలు తాగాడు కనుక ఆయనకి షడాననుడు, షణ్ముఖుడు అనే పేర్లు వచ్చాయి. అలాగే అగ్నిదేవుడి నుండి బయటకి వచ్చిన శివ తేజస్సు కనుక ఆయనకి పావకి, అగ్నిసంభవహా అని నామాలు. అలాగే పరమశివుడి కుమారుడు కనుక ఆయనని కుమారస్వామి అని పిలిచారు. అలాగే శివుడి వీర్యము స్ఖలనమైతే పుట్టినవాడు కనుక, స్కందుడు అని పిలిచారు. పార్వతీదేవిలా అందంగా ఉంటాడు కనుక, అమ్మ అందం వచ్చింది కనుక మురుగన్ అని పిలిచారు. పరమశివుడికి ప్రణవార్ధాన్ని వివరించాడు కనుకస్వామిమలై అన్నారు" అని విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడు. 

వాల్మీకి రామాయణం 33వ దినము

వాల్మీకి రామాయణం
33వ దినము, బాలకాండ. 

గంగ అసలు భూమి మీదకి ఎందుకొచ్చిందో చెప్తాను అని విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు " పూర్వం అయోధ్య నగరాన్ని మీ వంశానికి చెందిన సగరుడుపరిపాలించేవాడు, ఆయనకి కేశిని, సుమతి అని ఇద్దరు భార్యలు. సుమతి గరుక్మంతుడి సోదరి. తనకి కుమారులు కలగడం కోసం తన ఇద్దరు పత్నులతో కలిసి హిమాలయాలలో ఉన్న భృగు స్రవణాన్ని చేరుకొని 100సంవత్సరాలు తపస్సు చేశాడు సగరుడు. ఆ భృగు స్రవణంలో ఉన్న భృగు మహర్షి సంతోషించి, నీకున్న ఇద్దరు భార్యలలో ఒక భార్యకి వంశోద్ధారకుడైన కొడుకు పుడతాడు, రెండవ భార్యకి 60,000 మంది మహా ఉత్సాహవంతులైన కొడుకులు పుడతారు అని వరమిచ్చాడు. ఇది విన్న కేశిని, సుమతి తమలో ఎవరికి ఎంతమంది పుడతారు అని భృగు మహర్షిని అడుగగా, ఆయన మీలో ఎవరికి ఎవరు కావాలో మీరే తేల్చుకోండి అని అన్నారు. పెద్ద భార్య అయిన కేశిని తనకి వంశోద్ధారకుడైన ఒక కుమారుడు కావాలి అని అడిగింది, నాకు మహొత్సాహము కలిగిన 60,000 మంది కుమారులు కావాలి అని సుమతి అడిగింది. ఆయన సరే అన్నారు.
కొంతకాలానికి పెద్ద భార్యకి అసమంజసుడు అనే వాడు పుట్టాడు, రెండవ భార్యకి ఒక సొరకాయ పుట్టింది, ఆ సొరకాయ కిందపడి పగిలి అందులోంచి 60,000 మంది చిన్న చిన్న వాళ్ళు వచ్చారు. వాళ్ళని నేతి కుండలలో పెట్టి పెంచారు, వాళ్ళందరిని కలిపి సగరులు అన్నారు. పెద్ద భార్య కొడుకైన అసమంజసుడు రొజూ రాజ్యంలోని కొంతమంది పిల్లలని సరయు నదిలోకి తీసుకెళ్ళి, నీళల్లో వదిలి వాళ్ళ మరణానికి కారణం అయ్యేవాడు. కొంతకాలానికి రాజుకి విషయం తెలిసి.....

ఏవం పాప సమాచారః సజ్జన ప్రతిబాధకః ||

పౌరాణాం అహితే యుక్తః పిత్రా నిర్వాసితః పురాత్ ||

తప్పు చేసినవాడు కొడుకైనా సరే, అతనివల్ల ప్రజలకి కీడు జెరుగుతుంది కనుక శిక్షించాలి అని అనుకున్నాడు. ఆ అసమంజసుడిని రాజ్యం నుంచి బహిష్కరించాడు. ఆ అసమంజసుడి కొడుకైన అంశుమంతుడిని తన దెగ్గర పెట్టుకున్నాడు ఆ సగర చక్రవర్తి. అలా కొంతకాలానికి ఆ సగరుడు అశ్వమేథ యాగాన్ని ప్రారంభించి గుర్రాన్ని వదిలాడు. ఆ గుర్రాన్ని ఇంద్రుడు అపహరించాడు. ఆ గుర్రం వెనకాల వెళుతున్న అంశుమంతుడు ఈ విషయాన్ని సగరుడికి చెప్పాడు. అలా అశ్వం అపహరించబడితే దారుణమైన ఫలితాలు వస్తాయని ఆ యాగం నిర్వహిస్తున్న పండితులు అన్నారు. అప్పుడా సగరుడు తన 60,000 మంది కొడుకులని పిలిచి, ఈ భూమి 60,000 యోజనాలు ఉంటుంది, కనుక మీరందరూ ఒక్కో యోజనాన్ని తవ్వండి, భూమి మొత్తాన్ని వెతకండని చెప్పి పంపాడు. వజ్రాల్లాంటి తమ గొళ్ళతో ఆ సగరులు భూమినంతా తవ్వడం ప్రారంభించారు. ఇది గమనించిన దేవతలు బ్రహ్మదేవుడి దెగ్గరికి వెళ్లి................దేవా! సగరులు భూమిని తవ్వుతుంటే ప్రాణులన్నీ చనిపోతున్నాయి, ఏమి చెయ్యమంటారు అని అడిగారు. అప్పుడు బ్రహ్మ దేవుడు..........మీరెవరు కంగారు పడమాకండి, ఈ భూమంతా శ్రీమహా విష్ణువుది, కనుక ఆయనే ఈ భూమిని రక్షించుకుంటాడు, ప్రస్తుతం ఆయనపాతాళ లోకంలో కపిల మహర్షిగా తపస్సు చేసుకుంటున్నారు అని చెప్పారు.

వాల్మీకి రామునికి 16 సుగుణాలు ఉన్నాయి అన్నాడు. అవి ఏమేమిటి?

రామాయణం భారత దేశం ప్రపంచానికి అందించిన ఒక మహత్తర కావ్యం.
రామాయణం భారత దేశం ప్రపంచానికి అందించిన ఒక మహత్తర కావ్యం. ఇది ఒక కావ్యమే కాదు, భారతీయుల జీవన విధానం. భారత దేశం లో ఊహ తెలిసిన చిన్నపిల్లవాడి కి కూడా రామాయణం అంటే రాముడి కథ అని తెలుసు. ఇది అంతగా భారతీయుల జీవితంతో పెనవేసుకుపోయింది.

ఎవరైనా ఒక మంచి వ్యక్తి గురించి చెప్పాలంటే " అయన సాక్షాత్తు రామచంద్రుడే" అంటాం. ఒక మంచి కొడుకు గురించి చెప్పాలంటే " రాముడిలాంటి అబ్బాయండి " అంటాం. ఇంక ఒక మంచి భర్త గురించి చెప్పాలి అంటే రాముడిని మించిన పోలిక లేనే లేదు. మరి రాముడు ఇంత గొప్పవాడు అవడానికి రామునిలో ఉన్న లక్షణాలు ఏమిటి? వాల్మీకి చెప్పిన విషయం ఇక్కడ మనం గుర్తు చేసుకొందాం.

వాల్మీకి రామునికి 16 సుగుణాలు ఉన్నాయి అన్నాడు. అవి ఏమేమిటి? 1. గుణవంతుడు. 2. వీరుడు 3. ధర్మజ్ఞుడు. 4. కృతజ్ఞుడు 5. సత్య వాక్య పరిపాలకుడు 6. ధ్రుఢవ్రతుదు 7. ఉత్తమ చరిత్ర కలవాడు 8. సర్వ భూతముల హితము కోరేవాడు 9. విద్వాంసుడు 10. సమర్ధుడు 11. ప్రియవర్తనుడు 12. ఆత్మవంతుడు `13. జితక్రోధుడు 14. ద్యుతిమంతుడు 15. అసూయ లేనివాడు 16. ఈ సృష్టిలో ఎవరి కోపాన్ని చూసి దేవతలు కూడా భయపడతారో అటువంటి వాడు.

ఈ పదహారు లక్షణాలు ఒక మనిషిలో ఉండడం ఏ కాలం లో నైనా అరుదు. ఇన్ని మంచి గుణాలు కలవాడు కాబట్టే రాముడు మర్యాదా పురుషోత్తముడు అయ్యాడు. ఒక మంచి కొడుకు, ఒక మంచి భర్త, ఒక మంచి అన్న, ఒక మంచి పాలకుడు అయ్యాడు. రాముని గురించి చెప్పే ఏ పదమూ కూడా సామాన్యమైనది కాదు. ప్రతి శబ్దమూ విసేషమైనదే. "రామ" పదం హిందువుల రోమ రోమానా నాటుకొని వుంది. ఏ చిన్న కష్టం వచ్చినా' "అయ్యో రామ " అనే మాట మన నోట్లోంచి వస్తుంది. అలసిన వేళల కూడా "శ్రీరామ చంద్ర" అని స్మరిస్తాము. అంతగా మనం రాముణ్ణి మన సొంతం చేసుకున్నాం.

వాల్మీకి రామాయణం 34వ దినము

వాల్మీకి రామాయణం
34వ దినము, బాలకాండ. 

కాపిలం రూపం ఆస్థాయ ధారయత్య అనిశం ధరాం |

తస్య కోపాగ్నినా దగ్ధా భవిష్యంతి నృపాత్మజా ||

ఆ సగరులకి ఎంత తవ్వినా అశ్వం కనబడకపోయేసరికి వాళ్ళు సగరుడికి వద్దకు వెళ్ళి జెరిగినది చెప్పారు. నాకు గుర్రం తప్పకుండా కావాలి, మీరు పాతాళం దాక తవ్వెయ్యండని చెప్పి వాళ్ళని మళ్ళి పంపాడు. ఆ సగరులు పాతాళం దాకా తవ్వడం ప్రారంభించారు. అలా తవ్వుతున్న వాళ్ళకి, ఈ భూమిని తూర్పు దిక్కున మోస్తున్న దిశా గజం అనే ఏనుగు కనిపించింది. ఆ ఏనుగుకి ప్రదక్షిణ చేసి ముందుకి వెళ్ళగా, వాళ్ళకి మహా పద్మం అనే ఏనుగు భూమిని దక్షిణ దిక్కున మోస్తూ కనిపించింది, అలాగే పడమర దిక్కున సౌమనసం అనే ఏనుగు, ఉత్తర దిక్కున భద్రము అనే ఏనుగుకి ప్రదక్షిణ చేశారు. నాలుగు దిక్కులలో గుర్రం ఎక్కడా కనపడలేదు. ఈ సారి ఈశాన్యం వైపు తవ్వడం ప్రారంభించారు. అలా తవ్వగా తవ్వగా వాళ్ళకి ఒక ఆశ్రమంలొ సనాతనుడైన విష్ణు భగవానుడు కపిల మహర్షిగా తపస్సు చేసుకుంటూ కనబడ్డాడు. ఆయన పక్కనే యాగాశ్వం కూడా ఉంది. కాబట్టి ఈయనే మన గుర్రాన్ని దొంగాలించాడని ఆ సగరులు భావించి ఆయనని కొట్టడానికి పరుగుతీసారు. వెంటనే ఆ కపిల మహర్షి ఒక 'హుం'కారం చేసేసరికి ఈ 60,000 మంది సగరులు నేల మీద బూడిదై పడ్డారు. 

ఎంతకాలమైన సగరులు రాకపోయేసరికి, ఆ సగరుడు అంశుమంతుడిని పిలిచి వెతకమన్నాడు. అంశుమంతుడు తన పినతండ్రులు తవ్విన మార్గం ద్వారా ప్రయాణించి కపిల మహర్షి ఆశ్రమం చేరుకున్నాడు. అక్కడున్న తన పినతండ్రుల భస్మాన్ని చూసి బాధపడ్డాడు. వాళ్ళకి ఉత్తర క్రియలు జెరగలేదు కనుక నీళ్ళు తీసుకువద్దామని బయలుదేరగా, ఆ సగరుల మేనమామ అయిన గరుక్మంతుడు ప్రత్యక్షమై, ఈ భూమిలోని ఏ జలంతో జలతర్పణ ఇచ్చినా నీ పినతండ్రులు స్వర్గానికి వెళ్ళరు, వాళ్ళు స్వర్గానికి వెళ్ళాలంటే కేవలం స్వర్గలోకంలో ప్రవహించే గంగా జలాలతో తర్పణ ఇవ్వాలి. కాబట్టి గంగని భూమి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యి అని చెప్పాడు. సరే అని ఆ యాగాశ్వాన్ని తీసుకెళ్ళి యాగం పూర్తి చేశారు. తన కుమారులు కపిల మహర్షి ఆగ్రహానికి బూడిదయ్యారని విని సగరుడు చాలా బాధ పడ్డాడు. తరవాత ఆయన ఒక 30,000 వేల సంవత్సరాలు జీవించి శరీరం వదిలాడు, ఆయన తరవాత అంశుమంతుడు రాజయ్యాడు, ఆయన 32,000 సంవత్సరాలు తపస్సు చేశాడు, అలా తపస్సులోనే శరీరం వదిలేశాడు. ఆయన తరవాత వచ్చిన దిలీపుడు 30,000 సంవత్సరాలు రాజ్యం చేశాడు కాని గంగని తీసుకురాలేకపోయాడు. దిలీపుడి తరవాత వచ్చిన భగీరథుడు రాజ్యాన్ని మంత్రులకి అప్పజెప్పి, గోకర్ణ క్షేత్రంలో 1000 సంవత్సరాలు తపస్సు చేయగా, ఆయనకి బ్రహ్మదేవుడు దర్శనం ఇచ్చాడు. అప్పుడు భగీరథుడు " నాకు కుమారులు లేరు, కాబట్టి మా వంశం ఆగకుండా ఉండడానికి నాకు కుమారులు కలిగేలా వరమివ్వు అన్నాడు, అలాగే మా పితృదేవతలు స్వర్గానికి వెళ్ళడం కోసం సురగంగని భూమి మీదకి పంపించు" అన్నాడు. 

అప్పుడు బ్రహ్మదేవుడు " నీ మొదటి కోరికని నేను తీరుస్తాను, కాని గంగని భూమి మీదకి వదిలితే, దాన్ని పట్టగలిగేవాడు ఎవడూ లేడు, కేవలం శివుడు తప్ప. కావున నీవు శివుని గూర్చి తపస్సు చెయ్యి, ఆయన ఒప్పుకుంటే అప్పుడు గంగని వదులుతాను" అని అన్నాడు.

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles