Showing posts with label Quotes. Show all posts
Showing posts with label Quotes. Show all posts

Tuesday 8 December 2015

స్నానం అంటే ఏమిటి?


స్నానం అంటే ఏమిటి? ఇన్ని రకాల స్నానాల వల్ల మనకోచ్చేలాభాలేమిటి?
మానవుల్ని పవిత్రులను చేసుకోవడానికి భగవంతుడు అనుగ్రహించినవి జలము మరియు అగ్ని. అగ్ని యొక్క దాహక శక్తి మనల్ని దహింప చేస్తుంది కనుక జలముతో శుద్ధి చేసుకోవడం అందుబాటులో ఉన్న శాస్త్ర సమ్మతమైన విషయంగా చెప్పబడింది. హిందూ పురాణాలలో వివిధ రకాలైన స్నానాల గురించి ప్రస్తావించారు. స్నానాలని అయిదు విధాలుగా చెప్పినా చాలా రకాలుగా మనం విభజించు కోవచ్చును. స్నానం ఎప్పుడు చేస్తాం అనే అంశాన్ని పరిగణలోనికి తీసుకుంటే స్నానాలు మూడు విధానాలు. అవి

నిత్య స్నానం : ప్రతీరోజూ చేసే స్నానం నిత్య స్నానం.

నైమిత్తిక స్నానం : ఒక నిమిత్తాన్ని పురస్కరించుకొని చేసేది నైమిత్తికం.

ఉదా : గ్రహణం సమయములో, కక్కిన వెంటనే, క్షౌరం చేసుకున్న తరువాత, చెడ్డకలలు కన్న తరువాత, సంసారసుఖం అనుభవించిన తరువాత, ఎముకను పట్టుకొన్నపుడు, స్మశానానికి వెళ్ళినపుడు స్నానం చేయాలని పెద్దల అభిప్రాయం. ప్రసవించిన స్త్రీని ముట్టుకొన్నప్పుడు, రజస్వలయైన స్త్రీని ముట్టుకొన్నప్పుడు, శవాన్ని ముట్టుకొన్నప్పుడు, శవాన్ని అనుసరించి వెళ్ళిన తరువాత, ఇలా ఒక కారణం చేత చేసే స్నానం నైమిత్తికమన్నమాట.

కామ్య స్నానం : ఒక కోరికతో చేసేది కామ్య స్నానం.

ఉదా : తీర్థాదులలో, పుష్కరాలలో, రధసప్తమికి, కార్తీక మాసంలో, మాఘఫాల్గుణాలలో విశేష ఫలాలనుద్దేశించి చేసేదానికి, తన జన్మనక్షత్రం, వ్యతీపాత, వైదృతియను యోగాలు కలిసే రోజుల్లోగాని, పర్వతిథులలో చేసేది కామ్య స్నానం.

స్నానానికి ఉపయోగించే పదార్ధాన్ని బట్టి స్నానాలు రెండు విధములు.
ముఖ్య స్నానం : ఇది నీటిని ఉపయోగించి చేసేది ఇది మళ్ళీ రెండు రకాలు.
మంత్రం లేదా బ్రాహ్మ్యం : వేదములలో చెప్పబడిన నమక, చమక, పురుష సూక్తములను, మార్జన మంత్రాలను ఉచ్ఛరిస్తూ చేసేది "మంత్ర స్నానం". మంత్రించిన నీళ్ళని నెత్తిమీద చల్లుకోవడమే బ్రాహ్మ్య స్నానం.

"ఓం ఆపోహిష్టామ యోభువః
తాన ఊర్జే దధాతన మహేరణాయచక్షసే
యోవశ్శివతమోరసః
తస్య భాజయతేహనః
ఉశతీరివ మాతరః
తస్మారంగా మామవో
యస్యక్షయాయ చ తనః
ఆపో జన యధాచనః "

అనే మంత్రముతో పైన నీటిని చల్లుకుంటారు. పూజలు చేసేటప్పుడు కూడా గంగేచ, యమునేచ, గోదావరీ, సరస్వతీ, నర్మదా, సింధు, కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు అని నీళ్ళని మంత్రించి పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య, దేవస్య, ఆత్మానం సంప్రోక్ష్య అని మంత్రించిన నీళ్ళని చల్లాకనే పూజా విధానాలు మొదలుపెడతాం.

వారుణం : ఇది మామూలు నీళ్ళతో చేసేది. మనమందరం ఎక్కువగా చేసేది ఇదే. మనలో నిరంతరం విద్యుత్తు ప్రవహిస్తూ, ఎప్పటికప్పుడు విద్యుచ్ఛక్తి ఉత్పత్తి అవుతూ, బయటకు పోతూ ఉంటుంది. ఇలా నిరంతరం జరుగుతూ ఉంటేనే మనం ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటాం. నిజానికి శుచితో పాటు నీళ్ళతో దేహాన్ని తడపడంవల్ల లోపల ప్రవహిస్తున్న విద్యుచ్ఛక్తిని బయటకు పంపడం కూడా స్నానపు ప్రధాన ఉద్దేశ్యం. అందుకే పొద్దున్నే స్నానం చేయాలనే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. శరీరం మీద నీళ్ళు పడినప్పుడు, ఆ నీళ్ళు లోపలి విద్యుచ్ఛక్తిని పీల్చుకుంటాయి. ఆ రకంగా లోపలి విద్యుచ్ఛక్తి బయటకు వెళ్తుంది. ఆ ప్రక్రియ మొదలవగానే చురుకుదనం ప్రవేశిస్తుంది. పుణ్య నదులలో స్నానం ఆచరించడాన్ని కూడా వారుణ స్నానం అంటారు.

అముఖ్యం లేదా గౌణ స్నానం : నీరు లేకుండా చేసే స్నానాన్ని గౌణ స్నానం అంటారు. ఇది అయిదు రకాలు

* ఆగ్నేయస్నానం : హోమ భస్మాన్ని లేపనంగా పూసుకోడాన్ని ఆగ్నేయ స్నానం లేదా విభూది స్నానం అంటారు. అంటే ఒంటి నిండా విభూతి పూసుకుంటే దానిని విభూతి స్నానం అంటారు. భస్మానికి మూడు హంగులు కావాలి. ఒకటి, కాలగలిగే పదార్ధం. రెండు, అది రాజుకుని అంటుకోడానికి తగినంత వేడి. మూడు, ఆ వస్తువు మండడానికి తగినంత ఆమ్లజని సరఫరా. అప్పుడే ఆ వస్తువు కాలుతుంది. కాలగా మిగిలిన దానిని బూడిద అంటాం. విభూది ఒక రకం బూడిదే అలానే నీరు కూడా ఒక రకం బూడిదే. ఉదజని వాయువుని ఆమ్లజని సమక్షంలో మండించగా మిగిలిన బూడిదే నీరు. కనుక, మండవలసిన పదార్ధం అంతా మండిపోగా మిగిలినవే బూడిద, నీళ్ళూను. బూడిద ఒంటినిండా రాసుకోడానికీ, నీళ్ళు ఒంటి మీద పోసుకోడానికీ మధ్య ఉన్న వైజ్ఞానిక పరమైన సారూప్యాన్ని మనవాళ్ళకి తెలిసే ‘విభూది స్నానం’ అన్న పేరు పెట్టడం జరిగింది.

"శ్రీకరంచ పవిత్రంచ శోకరోగ నివారణం|
లోకే వశీకరణం పుంసాం భాస్మత్రైలోక్య పావనం||"

పరమ పవిత్రమైన, అనారోగ్యాలను పోగొట్టే, సంపదలను చేకూర్చే, బాధలను నివారించే, అందరినీ వశంలో ఉంచుకునే విభూతిని ముఖాన పెట్టుకుంటున్నాను- అని ఈ శ్లోక భావం. విభూతి చర్మవ్యాధులను నివారిస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ప్రతిరోజూ విభూతిని ధరించడం వల్ల రక్తంలో ఉండే దోషాలు, మలినాలు పోయి, రక్తప్రసరణ సవ్యంగా ఉంటుంది. విభూతి క్రిమినాశినిగా పనిచేస్తుంది. నుదురు, భుజాలు మొదలైన శరీర భాగాలపై స్వేదంవల్ల జనించిన క్రిములు కలిగించే రోగాలనుండి రక్షిస్తుంది. శరీర ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులు లేకుండా సమంగా ఉండేట్లు చేస్తుంది. ఆకలిని పెంచుతుంది. ఉద్రేకాలను తగ్గించి, శాంత స్వభావాన్ని చేకూరుస్తుంది. విభూతి స్వచ్చమైన తెల్లటి రంగులో ఉంటుంది కనుక ఇది నిర్మలత్వానికి సంకేతం. విభూది అంటే ఐశ్వర్యం అనే భావన కూడా ఉంది కనుక ఈ విభూది స్నానం చేస్తే ఐశ్వర్యవంతులం అవుతామన్న ఉద్దేశ్యంతో కూడా దీనిని ఆచరిస్తాం.

* భౌమస్నానం : పుణ్య నదులలో దొరికే మన్ను లేక పుట్ట మన్ను మొదలైన పవిత్ర మృత్తికను ఒంటి నిండా అలముకొని మృత్తికా మంత్రములతో చేసేది "భౌమ స్నానం". దీనినే mud bath అంటారు. పంచభూతాల్లో మట్టి ఒకటి. మనం కాలు మోపాలన్నా, మనకు సర్వాన్నీ ప్రసాదించే చెట్టుచేమలను పెంచాలన్నా మట్టే కదా అవసరం. మట్టి లేకపోతే మనకు మనుగడే లేదు. పుట్టింది మొదలు, చనిపోయేవరకూ మట్టితో మనకు విడదీయరాని సంబంధం ఉంటుంది. చివరికి తుది శ్వాస విడిచిన తర్వాత ఈ శరీరం మట్టిలోనే కలిసిపోతుంది. భస్మ స్నానం, మృత్తికా స్నానం పూర్తయిన తర్వాతనే క్రొత్త యజ్ఞోపవీతం వేసుకోవాలనేది శాస్త్రం. మట్టిలో ఎన్నో క్రిముల్ని సంహరించే శక్తితో పాటు గాయాలని మాన్పగల శక్తి కూడా ఉంది.

* వాయవ్యస్నానం : ముప్పయి మూడు కోట్ల దేవతులు నివశించియున్న గోవులు నడుస్తుండగా వాటి కాళ్ళ నుండి రేగే మట్టి మన మీద పడేలా నడవడం. విభూతిని పెట్టుకోవడం, గోధూళిలో విహరించడం అనేవి పవిత్రమైన అంశాలుగా పద్మ పురాణం చెప్తోంది. గోధూళిలో ఉండే కమ్మటి వాసన మనకు అనుభవమే! అది శాస్త్రీయంగా కూడా ఎంతో మేలు చేస్తుంది.

* దివ్యస్నానం : లోక భాంధవుడు, జగత్ చక్షువు, కర్మ సాక్షి అయినటువంటి సూర్య భగవానుడు ఆకాశంలో ఉండి సూర్య కిరణాలను వెలువరిస్తున్నపుడు వర్షం నీటిలో తడవడాన్నే దివ్య స్నానం అంటారు. అంటే, ఒక్కోసారి ఎంతమాత్రం మబ్బు పట్టకుండా ఎండలోనే వాన వస్తుంది కదా! అలాంటి వర్షంలో తడవడాన్ని దివ్య స్నానం అంటారు. ఇది చాలా అరుదైనది.

* మానసిక స్నానం : అంటే మానసికంగా చేస్తాం తప్ప నిజంగా చేసే స్నానం కాదు. నిత్యం నారాయణ నామ స్మరణతో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య అహంకార ఢంభ దర్పదైన్యాది మాలిన్యాలను మనస్సులో చేరనీక పోవడం "మానస స్నానం". ఇది మహత్తర స్నానం. మహా ఋషుల చేత ఆచరింప బడుతుంది. పైపై స్నానాలు కాకిస్నానాలు ఎన్ని చేసినా లోపలి దేహానికి కూడా చేయించినప్పుడే అది సంపూర్ణ స్నానం అవుతుంది.

ఖస్థితం పుండరీకాక్షం చింతయేత్ పురుషోత్తమం| అనంతాదిత్యసంకాశం వాసుదేవం చతుర్భుజం||
శంఖచక్ర గదా పద్మధారిణం వనమాలినం| ధ్వజ వప్ర అంకుశైర్లక్ష్య పాదపద్మం సునిర్మలం||
త్వత్పాదోదజాం గంగాం నిపతంతీం స్వమూర్ధని| చింతయేత్ బ్రహ్మరంధ్రేణ ప్రవిశంతీం స్వకాంతమం||
తయా సంక్షాళయే త్సర్వమంతర్దేహగతం మలం| తత్ క్షణాత్ విరజా మర్త్యో జాయతే స్ఫటికోపమ:||
ఇదం మానసికం స్నానం ప్రోక్తం హరిహరాదిభి:| సార్దత్రికోటి తీర్ధేషు స్నానాత్కోటి గుణాధికం||
యోనిత్యమాచరేద్దేవం సవియెనారాయణ స్మృత:| కాలమృత్యు మతిక్రమ్య జీవత్యేవ నసంశయ:||

అంటే పరమాకాశంలో ఉండే పురుషోత్తముడయిన వాసుదేవుడిని, నాలుగు భుజములు కలవాడిని, శంఖ చక్ర గద పద్మము వనమాలలను ధరించినవానిని, ధ్వజాదులనే మంగళకరమైన గుర్తులున్నవానిని ధ్యానించాలి. వాని పాద పద్మముల నుండి పుట్టిన గంగను తన శిరస్సుపై పడి బ్రహ్మరంధ్రం వెంబడి హృదయంలో ప్రవేశించే దానిగా భావించాలి. ఆ గంగచేత తన పాపలు పోతున్నట్లుగా చింతించాలి. అప్పుడు స్ఫటికం మాదిరిగా మలినాలు లేకుండా నిర్మలంగా ఉండి మృత్యువును దాటగలరు. ఇలా హరిహరులను తలుచుకుంటూ చేసే మానసిక స్నానం కోటి పుణ్య నదులలో చేసిన స్నానం కన్నా గొప్పది అని దీని భావము.

ఇడా భాగీరథీ గంగా, పింగళా యమునా స్మృతా|
తయోర్మధ్యగతా నాడీ, సుషుమ్నాఖ్యా సరస్వతీ||

జ్ఞానహ్రదే ధ్యానజలే రాగద్వేష మలపహే|
య:స్నాతి మానసే తీర్ధే సయాతి పరమాం గతిం||

అచ్యుతోహం అనంతోహం గోవిందోహం అహం హరి:|
ఆనందోహం అశేషోహం అజోహం అమృతోస్మ్యహం||

నిత్యోహం నిర్వికల్పోహం నిరాకారోహం అవ్యయ:|
సచ్చిదానందరూపోహం పరిపూర్ణోస్మి సర్వదా||

బ్రహ్మైవాహం నసంసారీ, ముక్తోహమితి భావయేత్|
ఆశక్నువన్ భాపయితుం వాక్యమేతత్ సమభసేత్||

ఏవం య: ప్రత్యహం స్మృత్వా, మానసం స్నానమాచరేత్|
సదేహాంతే పరబ్రహ్మపదం యాతి నసంశయ:||

ఎడమ ముక్కులోనున్న ఇడానాడిని భాగీరథిగా, కుడి ముక్కులో నున్న పింగళనాడిని యమునగా, వాటి మధ్యలో నున్న సుషుమ్నును సరస్వతిగా భావించాలి. రాగద్వేషాలనే మాలిన్యాన్ని పోగొట్టే జ్ఞానమనే సరస్సులో స్నానం చేసినట్లు భావించి నేనే అచ్యుతుడను, గోవిందుడను, హరిని, ఆనందరూపుణ్ణి, చావు పుట్టుకలు లేని పరమాత్మ స్వరూపాన్ని నేనే అని భావిస్తూ మనస్సులోనే స్నానం చేస్తున్నట్లుగా భావించి తరించాలి అని దీని భావము.

అభ్యంగన స్నానం : ఇక మిగతా రకాల స్నానాల గురించి చెప్పుకోవాలంటే అభ్యంగన స్నానం ఒకటి. నఖ శిఖ పర్యంతము తలస్నానము చేయుట . ఇది కనీసం నెలకి రెండు సార్లయినా అందరూ చేయాలి! మరి దాని వలన ప్రయోజనాలేమిటో చూద్దాం -

1. వేడినీటి స్నానం --చర్మాన్ని బలపరచి, చర్మంపైగల క్రిములను సంహరిస్తుంది. నూనె మర్దన శరీరంలో రక్తసరఫరా మెరుగుపరచి ఆరోగ్యవంతమైన చర్మాన్నిస్తుంది.

2. సౌనా పేరుతో నేడు చేయబడే స్టీం బాత్ లు --చర్మకణాలను పూర్తిగా శుభ్రపరచి, చర్మ రంధ్రాలు స్వేచ్ఛగా గాలి పొందేలా చేస్తాయి.

3. శరీర వెనుక భాగ చర్మం, పిరుదులు, భుజాలు, మొదలైనవి గట్టిగా వుంటాయి. వేడినీరు తగిలితే ఆ భాగాలలోని నొప్పులు, మంటలు మొదలైనవి తగ్గుతాయి. ముఖంపైన, తలపైన వేడినీరు వాడటం వలన జుట్టు ఊడే ప్రమాదం కూడా వుంది.

4. వేడి నీటి తలంటు స్నానం చర్మానికి నూనెను ఇచ్చి మెత్తబడేట్ల చేస్తుంది. నూనెతో మర్దన, పసుపు శనగపిండిలతో కూడిన పేస్టు రోగాలను తెచ్చే క్రిములను నశింపజేస్తుంది. చర్మం దురదలు, మంట తగ్గుతాయి. అపుడపుడూ అభ్యంగన స్నానం చేస్తే, మెదడు చక్కటి రిలాక్సేషన్ పొంది చురుకుగా వుంటుంది. వేడినీటిలో సువాసన ద్రవ్యాలు వేస్తే అవి చర్మానికి సహజ కాంతి నిచ్చి చెడు వాసనలను పోగొడతాయి.

సముద్ర స్నానము:
మానవుడు సముద్రములో మునుగగానే, అన్ని తీర్థములలోను పుణ్యనదులలోను స్నానము చేసిన పుణ్యము లభించును.

కార్తీక స్నానము:

కార్తీకమాసంలో తైలము రాసుకొని స్నానము చేయకూడదు. పురాణాలను విస్మరించరాదు. కార్తీకమాసంన వేడినీటితో స్నానము కల్లుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెడు. కాబట్టి వేడినీటితో స్నానము కూడదు. ఒకవేళ అనారోగ్యముగా వుండి యెలాగైనా విడువకుండా కార్తీకమాసవ్రతం చేయాలన్న కుతూహలం కలవారు మాత్రమే వేడినీటి స్నానం చేయవచ్చు. అలా చేసేవారు గంగా, గోదావరీ సరస్వతి యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానం చేయాలి.

మానవుల్ని పవిత్రులను చేసుకోవడానికి భగవంతుడు అనుగ్రహించినవి జలము, అగ్ని. అగ్నితో శుద్ధి చేసుకోవడం వీలు బడదు. అగ్ని యందలి దాహక శక్తి మనల్ని దహింప చేస్తుంది కనుక జలముతో శుద్ధి చేసుకోవడం అందుబాటులో ఉన్న శాస్త్ర సమ్మతమైన విషయంగా చెప్పబడింది. హిందూ పురాణాలలో వివిధ రకాలైన స్నానాల గురించి చెప్పబడింది.

మంత్ర స్నానం వేదమందు చెప్పబడిన నమక, చమక, పురుష సూక్తములను, మార్జన మంత్రములను ఉచ్ఛరిస్తూ చేయునది "మంత్ర స్నానం"

భౌమ స్నానం పుణ్య నదులలో దొరుకు మన్ను లేక పుట్ట మన్ను మొదలగు పవిత్ర మృత్తికను ఒంటి నిండా అలముకొని మృత్తికా మంత్రములతో చేనునది "భౌమ స్నానం".

ఆగ్నేయ స్నానం సమస్త పాపములను దగ్ధం చేసే పుణ్య రాశిని చేకూర్చే భస్మమును మంత్ర సహితముగా లేదా శివ నామమును ఉచ్ఛరిస్తూ ధరించి చేయునది "ఆగ్నేయ స్నానం"

వాయువ్య స్నానం ముప్పది మూడు కోట్ల దేవతులు నివశించు గోమాత పాద ధూళి చేత చేయునది "వాయువ్య స్నానం"

దివ్య స్నానం లోక భాంధవుడు, జగత్ చక్షువు, కర్మ సాక్షి అగు సూర్య భగవానుడు ఆకాశంలో ఉండి సూర్య కిరణాలను వెలువరిస్తున్నపుడు వానలో స్నానం చేయడం "దివ్య స్నానం". ఇది అరుదైనది. దీనికి వాతావరణం అనుకూలించాలి.

వారుణ స్నానం పుణ్య నదులలో స్నానం ఆచరించడం "వారుణ స్నానం".

మానస స్నానం నిత్యం నారాయణ నామ స్మరణతో కామ క్రోధ లోభ మోహ మద మత్సర అహంకార ఢంభ దర్పదైన్యాది మాలిన్యాలను మనస్సులో చేరనీక పోవడం "మానస స్నానం". ఇది మహత్తర స్నానం.

Thursday 3 December 2015

సంధ్యావందన ప్రాశస్త్యం

గాయత్రిమంత్రం అన్ని వేదమంత్రాల సారం, శక్తిరూపం. గాయత్రి మంత్రజపం చేయ్యనిదే మరే మంత్రము కూడా ఫలించదు. గాయత్రిమంత్రము ఈ జననమరణాల చక్రభ్రమణం నుండి మనలను దాటించగలిగే మహా శక్తివంతమైన సాధనం. గాయత్రీ జపాన్ని అందరూ ఒక వ్రతంగా తీసుకోవాలి. ఆ నిప్పు మనలో వున్నన్నాళ్ళు చెడు ఆలోచనలు, చెడు తలంపులు మన దరికి రావు.
గాయత్రి జపం, మరియు అర్ఘ్యం ఈ రెండూను సంధ్యావందనంలో అతి ముఖ్యమైన కర్మలు. మిగిలినవన్నీ కూడాను వాటికి అంగాల వంటివి. అనారోగ్యంతోకానీ, నీరసంగా వున్నవాడు కానీ కనీసం అర్ఘ్యం విడిచి 10 మార్లు గాయత్రి జపం చెయ్యాలి. ఇది కేవలం అనారోగ్యవంతులకు మాత్రమె. ఆరోగ్యంగా వున్నవారు తప్పక పూర్తి సంధ్యావందనం చెయ్యవలసిందే. మహాభారత యుద్ధంలో నీరు దొరక్క భీష్ముడు మృత్తికతో అర్ఘ్యం విడిచాడు. కానీ ఇటువంటివి కొన్ని ప్రత్యేక పరిస్థుతులకు మాత్రమె.
ఇంట్లో వున్న ఒక రోగి చాలా అనారోగ్యంతో బాధపడుతుంటే సంధ్య వార్చిన నీటిని అతడిచే తాగించాలి. గాయత్రిజపం మన స్థూల సూక్ష్మ దేహాలకు మందు వంటిది. ఒక మనిషి జీవించినంత కాలము సంధ్యావందనం చెయ్యాలి. గాయత్రి తల్లివంటిది. దైవం ఎన్నో రూపాలలో మనకోసం అవతరిస్తుంది. మనకోసం మన బాగు కోసం మనకు అందేవిధంగా సాధన చెయ్యగలిగే అతి సులభమైన మంత్రం గాయత్రి, వేదమాత. గాయత్రి మంత్రం జపం వలన ప్రముఖంగా కలిగే లాభం “చిత్తశుద్ధి”. మనకు చిత్తభ్రాంతి వలన ఎన్నో చికకులోస్తున్నాయి. వాటిని నియంత్రించగలిగే శక్తి మన సాధనలోనే వుంది.
మనకు ఒంట్లో బాగాలేనప్పుడు మన పని మన బంధువులకో లేక మిత్రులకో చెప్పి చేయించుకుంటాం. అటువంటప్పుడు మన తరపున వారు గాయత్రీ మంత్రం జపం చెయ్యవచ్చును.
మనమందరమూ నిత్యాగ్నిహోత్రంలా ఈ గాయత్రి జప యజ్ఞాన్ని కొనసాగించాలి. దీనివలన లబ్ది పొందేది మనమే. ఈ వేదజ్యోతిని మరింత ప్రకాశింప చేద్దాం. టూకీగా చెప్పాలంటే మనకు కలిగే లాభాలు
౧. చిత్తశుద్ధి
౨. మానసిక ప్రశాంతత
౩. స్వీనియంత్రణ
౪. దృష్టి కేంద్రీకరణం
5. శారీక, మానసిక పరిశుభ్రత
6. ఆహ్లాద వాతావరణము
7. క్రమశిక్షణ
8. మన పూర్వులతో అనుసంధానం, వారి దీవెనలు
9. ప్రాణాయామం
10. ఆధ్యాత్మిక పరిపక్వత
11. ఓజస్సును తేజస్సుగా మార్చుకోగల శక్తి
12. acupressure ద్వారా ఆరోగ్యం
13. మందేహుల నియంత్రణ ద్వారా మనకున్న మండబుద్ధిని పారద్రోలడం
ఇంకా మరెన్నో ఉపయోగాలున్నాయి సంధ్యావందనం ఆచరించడం ద్వారా.

2. నేను బ్రాహ్మనేతర వాడను. నాకు సంధ్యావందనం చెయ్యమని ఎవరూ చెప్పలేదే?

శాస్త్రం శూద్రునికి మాత్రమె మినహాయింపు ఇచ్చింది. చాతుర్వర్ణాలలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు అందరూ కూడా సంధ్యావందనం చెయ్యాలి. కేవలం మగవారు మాత్రమె చెయ్యాలి. వారు చేసిన మంత్రఫలం వారి వారి ఆడవారికి సగం చేరుతుంది. ఈ మూడు వర్ణాలు చేసిన మంత్రజప ఫలితం మొత్తం అన్ని జాతుల వారికీ చేరతాయి. గాయత్రి చెయ్యగలిగే వారు మిగిలిన వర్ణాలకు, ఆడవారికి ట్రస్టీలన్నట్లు. వారు చెయ్యకపోతే వీరందరికీ ద్రోహం చేసినవారువుతున్నారు. కావున అధికారం ఉన్న వాళ్ళందరూ తప్పక సంధ్యావందనం చెయ్యాలని జగద్గురువుల ఆదేశం.

                          (సశేషం )

!! ఓం నమో వేంకటేశాయ !!
!! సర్వం శ్రీ వేంకటేశ్వరార్పణమస్తు !!

Wednesday 2 December 2015

మంచి మాటలు

దేనికైనా కాలం కలసి రావాలి. అందరికీ అవకాశం కల్పిస్తాడు దేవుడు. అందుకోసం వెయిట్‌ చెయ్యాలన్నారు.అలాగే నాటకం చూడాల్సి వస్తే ముందు వరుసలో కూర్చుంటాం. అదే సినిమా చూడాల్సి వస్తే వెనుక వరుసలో కూర్చుంటాం. ముందు వెనుకలన్నవి సాపేక్షం.

సబ్బును తయారు చెయ్యాలంటే ఆయిల్‌ కావాలి! అదే చేతికి అంటిన ఆయిల్‌ను పోగొట్టుకోవాలంటే…సబ్బు కావాలి.చిత్రంగా లేదు? జీవితమూ ఇంతే అన్నారు. సమస్య వచ్చి పడింది. జీవితం అయిపోయింది అనుకోకూడదు. దానిని ఓ మలుపుగా భావించాలి.

ఈ ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు ఆనందిస్తారట! ఒకరు పిచ్చివాళ్ళు. మరొకరు చిన్నపిల్లలు. గమ్యాన్ని చేరుకోవాలంటే పిచ్చితనం కావాలి. చేరుకున్న గమ్యాన్ని ఆనందించాలంటే చిన్నపిల్లలైపోవాలన్నారు.

తాళం తో పాటే తాళం చెవి
కూడా తయారు చేయబడుతుంది.
ఒకటి లేకుండా రెండోది తయారు కాబడదు.
అలాగే పరిష్కారం లేకుండా ఒక సమస్యను
భగవంతుడు స్రుష్టించే అవకాశమే లేదు.

: తూటా కంటే శక్తివంతమైనది మాట!
ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు,
ఒకే మాటతో లేని బందాన్ని పంచుకోవచ్చు

మనిషి సమాజంలో సూదిలా బ్రతకాలి,
కత్తెర లాగ కాదు.
సూది పని ఎప్పుడూ జోడించడమే,
కత్తెర పని ఎప్పుడూ విడదీయడమే,
అందరిని కలుపుకుంటూ బ్రతకాలి.
కత్తెర లాగా విడదీస్తూ కాదు..

నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు,
కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది.

నీవు సంతోషంగా ఉన్నావంటే
నీకు సమష్యల్లేవని కాదు,
వాటిని ఎదుర్కోగల శక్తి, ధైర్యం
నీకున్నాయని…

స్నేహితుడిని నీ దుఃఖసమయంలోను,
యోధుడిని యుద్ధంలోను,
భార్యను పేదరికంలోను,
గొప్పవ్యక్తిని అతని వినయంలోను
పరీక్షించాలి.

చేసిన తప్పుకు క్షమాపణ
అడిగినవాడు ధైర్యవంతుడు.
ఎదుటి వారి తప్పును
క్షమించగలిగిన వాడు బలవంతుడు.
కష్టం అందరికీ శత్రువే, కానీ
కష్టాన్ని కూడా చిరునవ్వుతో స్వీకరిస్తే,
సుఖమై నిన్ను ప్రేమిస్తుంది.

ఓటమి లేనివాడికి అనుభవం రాదు,
అనుభవం లేనివాడికి జ్ఞానం రాదు.
గెలిచినప్పుడు గెలుపును స్వీకరించు,
ఓడినప్పుడు పాఠాన్ని స్వీకరించు.
ఎలా నిలదొక్కుకున్నావన్నది కావల్సింది.
ఓడిపోయి విశ్రాంతి తీసుకుంటునప్పుడు
ఆ ఓటమి నేర్పిన పాఠాన్ని చదువుకో,
గెలుస్తావు.

ఎవరికైనా ఉండేది రోజుకు 24 గంటలే,
గెలిచేవాడు ఆ 24 గంటలూ కష్టపడుతుంటాడు.
ఓడేవాడు ఆ 24 గంటలు ఎలా కష్టపడలా అని ఆలోచిస్తుంటాడు.
అదే తేడా…

గెలవాలన్న తపన,
గెలవగలను అన్న నమ్మకం,
నిరంతర సాధన.
ఈ మూడే నిన్ను గెలుపుకు
దగ్గర చేసే సాధనాలు.

నేను గెలవటంలో ఓడిపొవచ్చు, కానీ
ప్రయత్నించడంలో గెలుస్తున్నాను…
ప్రయత్నిస్తూ గెలుస్తాను.. గెలిచి తీరుతాను.

స్వయంకృషితో పైకొచ్చినవారికి
ఆత్మవిశ్వాసం ఉంటుంది గానీ,
అహంకారం ఉండదు.

మూర్ఖుడు తాను ఇతరులకు
మోసం చేయగలుగుతున్నాను కాబట్టి
తెలివి గలవాణ్ణి అనుకుంటాడు.
అది తన పిచ్చితనమని,
తన నాశనానికి దారితీస్తుందని గ్రహించడు.

Tuesday 1 December 2015

భోజన వేళలో శుభాశుభ శకునాలు

భోజన వేళలో శుభాశుభ శకునాలు
శుభం, అశుభం ఫలితాలు మనకు కలిగే
ముందు అనేక రకాలైన అనేక శకునాలు వాటి
గురించే ముందే సూచిస్తుంటాయి. అలాంటి
శకునాలు అనేకం వున్నాయి.
భోజన సమయంలో ఎలాంటి శకునం, ఎలాంటి శుభ, అశుభ ఫలితాలను
కలిగిస్తుందో తెలుసుకుందాం. భోజనం చేస్తుండగా హఠాత్తుగా వర్షం పడితే మంచి
జరుగుతుంది.
పచ్చదనం, సమృద్ది కలుగుతుంది.
భోజనం చేసేటప్పుడు కాకి వచ్చి
తలపై కూర్చుంటే అశుభం. అలాగే కాకి భోజన
సమయంలో కుడిభుజంపై వాలితే కడుపులో
వికారం, ఎడమ భుజంపై వాలితే కులనాశకుడవటం
జరుగుతుందని సూచన.
భోజనం చేసే వేళలో కుక్క ఏడుపు వినిపిస్తే
అశుభసూచన. అలాగే అవి మొరుగుతే, ధాన్యం
దొంగతనం అవుతుందనటానికి సంకేతం.
ఏదైనా వివాదం భోజనం చేస్తున్నప్పు ప్రారంభమైనా అది
అశుభం. ఆ ఇంట్లో అన్నానికి కొరత
ఏర్పడుతుంది. తినేటప్పుడు ఏడుపు శబ్దం
వినిపిస్తే, విన్న వారికి ఆరోగ్యం దెబ్బ తింటుందని
సూచన.
రొట్టె ఎక్కువగా కాలి మాడిపోతే ఆహార నష్టం
జరుగుతుందని గ్రహించాలి.
ఆ సమయంలో పాము కనిపిస్తే అశుభంగా
పరిగణిస్తారు.
భోజన సమయంలో పాము కనిపిస్తే
భోజనంలో విషం కలిసిందన్న అనుమానానికి కారణం అని పండితుల అభిప్రాయం.
ఇవి భోజన వేళలో శకునాల వల్ల కలిగే, శుభ, అశుభ పరిణామాలు. శకునాలు
మనకు సూచనలు మాత్రమే. వాటికి సంబంధించిన పరిహారాలు, అశుభ శకునాల
నుంచి పరిగ్రహించుకొనుటకు మార్గాలు కూడా
ఉంటాయి.
సూచనలుగా శకునాలను గ్రహించి
జాగ్రత్త వహించటం ఎంతైనా మేలు.

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles